టాలీవుడ్లో ప్రస్తుతం ఓ వార్త కలకలం రేపుతోంది. ఏకంగా రూ.7 కోట్లు జీఎస్టీ పన్నులను చెల్లించకుండా ఎగవేశారని ఆరోపణలు హల్చల్ చేస్తున్నాయి. ఆ నిర్మాత ఎవరూ అంత బాకీ ఎలా పడ్డారు? అనే ప్రశ్నలు తిరుగుతున్నాయి. ఈ చెల్లింపులు చేయాలని బుధవారం (ఫిబ్రవరి 21) కేంద్ర ప్రభుత్వ అదికారులు నిర్మాత కార్యాలయాల మీద దాడులు నిర్వహించారని సమాచారం. అయితే ఈ వార్త తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనాలు సృష్టిస్తోంది. దీనిపై ఓ దినపత్రిక కూడా కథనం ప్రచురించింది. అయితే ఆ నిర్మాత ఎవరూ అనేది పక్కాగా తెలియడం లేదు.
వరుస విజయాల మీద ఉన్న ఓ ప్రముఖ నిర్మాత అని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం నైజాం కింగ్గా ముద్రపడిన ఆ నిర్మాత పన్నులు బకాయి పడ్డారని తెలుస్తోంది. అధికారుల దాడుల నేపథ్యంలో సదరు నిర్మాత అప్పటికప్పుడు రూ.2 కోట్లు చెల్లించారని, మిగిలిన రూ.5 కోట్లు చెల్లించడానికి వారం గడువు అడిగారని సమాచారం. ఆలోగా మిగిలిన బకాయి చెల్లించకపోతే నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లతో ప్రొసీడ్ అవుతామని హెచ్చరించారు.
అయితే జీఎస్టీ అమల్లోకి వచ్చిన జూలై తర్వాత.. నిర్మాత తీసిన చిత్రాలకు సంబంధించి వివిధ విభాగాలకు చెల్లింపుల్లో మినహాయించుకున్న జీఎస్టీని.. జమ చేయలేదనేది అసలు విషయం. అయితే ఈ కేసులో ఇంకో తిరకాసు ఉంది. నిబంధనల ప్రకారం జీఎస్టీ ఎగవేస్తే ఎగవేసిన మొత్తానికి అంతే మొత్తం జరిమానాగా చెల్లించాలని ఉంది. ముందు మొత్తం చెల్లించిన తర్వాత షోకాజు నోటీసు పంపి ఆ తర్వాత మళ్లీ జరిమానా విధిస్తారని సమాచారం. అంటే అదనంగా మరో రూ.7 కోట్ల భారం కూడా పడుతుంది. మరీ ఇలాగా పెండింగ్ పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తే ఈ తలకాయ నొప్పి ఉండదు కదా!