హీరో నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’ ప్రీ రిలీజ్ టూర్లో బిజీగా ఉన్నారు. విడుదల తేదీ దగ్గరపడటంతో తన సినిమాకు వీలైనంత ఎక్కువ ప్రచారం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం విశాఖపట్నం వెళ్లిన నితిన్.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు.
అయితే ఆలయానికి వెల్లిన నితిన్పై ఆర్చకులు తాళ్లతో బంధించి.. ఆయనపై దొంగతనం ఆపాదించారు. ‘పాపులర్ హీరో అయిన మీరు స్వామివారి ఉంగరాన్ని దొంగిలించడమేంటండి.. మర్యాదగా ఆ ఉంగరాన్ని ఇచ్చేయండి’ అంటూ నితిన్ను అర్చకులు అడిగారు.
దీంతో అవాక్కయిన నితిన్.. ‘నేను తియ్యలేదండి. కావాలంటే చెక్ చేసుకోండి’ అంటూ సమాధానమిచ్చారు. శనివారం రాత్రి స్వామివారి ఉంగరం పోయింది. దొంగలెవరో కనిపెట్టో పనిలో ఉన్నాం. మాకు ఉంగరం దొరికే వరకు మీరు బందీలుగా ఉండాల్సిందే’ అంటూ హుకుం జారీ చేశారు. దీంతో నితిన్తో పాటు మరికొంత మంది బందీలుగా అక్కడే ఉండిపోయారు. ఈ తతంగాన్ని అక్కడున్నవారు నవ్వుతూ వీక్షించారు. ఇదేంటి నితిన్తో పాటు బందీలుగా ఉన్నవారంతా టెన్షన్తో బిగిసుకుపోతే భక్తులు నవ్వడమేంటని అనుకుంటున్నారా..? అసలు విషయానికి వస్తే..
సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా చివరి రోజు వినోదోత్సవం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా స్వామి వారి ఉంగరాన్ని ఎవరో దొంగిలించారని కొంత మంది భక్తులను బంధించి ఆటపట్టిస్తారు. ఇది ప్రతి ఏటా జరిగే తంతే. కాకపోతే ఈసారి నితిన్ బుక్కయ్యారు. అర్చకులు అసలు విషయం బయటపెట్టడంతో నితిన్ ఊపిరి పీల్చుకున్నారు.