- మహానటి సావిత్రి జయంతి నేడు
- ఆమె జీవిత చరిత్ర నేపథ్యంలో ఓ సినిమా
వెండితెర అందం ఎప్పటికీ చెరగనిది. ఆమె అందం ఇప్పటికీ ఎవరికీ రాదు. రాలేదు.. రాకూడదు కూడా. ఆమె అందమే కాదు ఆమె నటన.. పలికించే హావభావాలు.. ప్రవర్తన.. హుందాతనం.. వ్యవహార శైలి ఎవరికీ రావు. వెండితెర వెన్నెలగా ఆమె ఆ తరం సినీ పరిశ్రమలో వెలిగారు. మాయాబజార్, నర్తనశాల, తోడి కోడళ్లు, గుండమ్మకథ, మిస్సమ్మ వంటి మరుపురాని చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు. ఆవిడెవరో కాదు అలనాటి నటి సావిత్రి. ఆమెకు మహానటిగా పేర్కొనడం అతిశయోక్తి ఏమీ కాదు. ఆమె జయంతి (డిసెంబర్ 6) సందర్భంగా ఒకసారి గుర్తుచేసుకుందాం.
వెండితెర సామ్రాజ్ఞిగా సావిత్రిని చెప్పుకోవచ్చు. నటిగానే కాకుండా నిర్మాత, దర్శకురాలిగా తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు. అసమాన ప్రతిభ ఆమె సొంతం. 1933 డిసెంబర్ 6వ తేదీన గుంటూరులోని చివ్వూరు గ్రామంలో ఆమె జన్మించారు. ఆరు నెలల వయసులోనే తండ్రిని కోల్పోయి జీవిత ప్రయాణాన్నికష్టాలతో ప్రారంభించారు. ఎన్నో ఆటుపోట్ల మధ్య సినీ రంగంలోకి ప్రవేశించారు.
కొంగర జంగయ్యకు ఓ డ్రామా కంపెనీలో పనిచేస్తూ విజయవాడలో బాలనటిగా నటించారు. నవభారత నాట్య మండలిలో పనిచేస్తుండగా అవకాశాలు వచ్చాయి. కానీ చిత్రాలు గట్టెక్కలేదు. చివరికి శాంతి సినిమాతో కెరీర్ మొదలైంది. ఆ తర్వాత పాతాళభైరవి 1951తో సినీరంగంలో ఓ వెలుగు వెలిగేందుకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేశారు. ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించి మెప్పించారు.
దేవదాసు, కన్యాశుల్కం, భలేరాముడు, వినాయక చవితి, దొంగరాముడు, ఇంటిగుట్టు, శ్రీవేంకటేశ్వర మహత్యం, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి, పూజాఫలం వంటి మంచి హిట్ సినిమాల్లో నటించారు. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర్రావు, కృష్ణ, శోభన్బాబు తదితరులతో కలిసి నటించారు. ఏఎన్నార్, ఎన్టీఆర్, సావిత్రి చేస్తే హిట్ పెయిర్గా పేరు పొందారు.ఆమె తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించారు. ఎన్నో అవార్డులు ఆమె ఇంటికి పరుగులు పెట్టుకుంటూ వెళ్లాయి. అవార్డులు, రివార్డులు, సత్కారాలు, పురస్కారాలు ఆమెకు లెక్కేలేదు.
చివరికి తమిళ నటుడు జెమినీ గణేశన్ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని విషాద ఘటనలు చేసుకున్నాయి. ఆ జీవితంపై కూడా వివాదాస్పద ఘటనలు ఉన్నాయి. వాస్తవాలైతే ఎవరికీ తెలియదు. చివరికి అనారోగ్యంతో ఆ మహానటి 26 డిసెంబర్ 1981లో (40 ఏళ్లు) సినీ పరిశ్రమకు శాశ్వతంగా దూరమయ్యారు.ప్రస్తుతం ఆమె జీవిత చరిత్ర నేపథ్యంలో తెలుగులో ఓ సినిమా రాబోతోంది.