చార్మిని ప్రధాన పాత్రలో నటింపజేస్తూ “జ్యోతి లక్ష్మి” అనే సినిమాను తీస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఆ సినిమా కథను పూర్తిగా వివరించేశాడు.
ఇంకా ప్రొడక్షన్ దశలోనే ఉన్న ఈ సినిమా కథను తను ఎక్కడ నుంచి తెచ్చుకొన్నానో ఆయనే వివరించాడు. ఇది దశాబ్దాల కిందటే నవల గా వచ్చిన కథ అని పూరి వివరించాడు.
ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన “మిసెస్ పరాంకుశం” నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా పూరి ప్రకటించాడు. ఆ నవలలో కొన్ని మార్పు చేర్పులతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా ఆయన వివరించాడు. మిసెస్ పరాంకుశమే.. ఈ జ్యోతి లక్ష్మి అని పూరి స్పష్టత ఇచ్చాడు.
మల్లాది తన 19 వ యేట ఈ నవలను రాశాడని.. ఇప్పుడు దాన్ని తెరకెక్కిస్తున్నానని ఆయన వివరించాడు. మరి నవల రచయితగా మల్లాదికి మంచి పేరు ఉంది. ఆయన రచించిన వివిధ నవలలు సినిమాలుగా వచ్చాయి. హాస్య చిత్రాల దర్శకుడు జంధ్యాల కూడా మల్లాది రచించిన వివిధ నవలలను సినిమాలుగా తెరకెక్కించారు. అనేక టాలీవుడ్ సినిమాలకు మూలకథ రచయితగా నిలిచిన మల్లాది కథనం స్ఫూర్తితో చాలా కాలం తర్వాత ఈ సినిమా వస్తోంది. మరి ఆ కథను పూరి ఎలా తెరకెక్కించాడో.. ఇది ఏ మేరకు ఆకట్టుకొంటుందో. అయితే ఇప్పుడు పూరి ఇలా ప్రకటించేశాడు కాబట్టి.. చాలా మంది ఆ నవలను కొనుగోలు చేసి చదువుకొనే అవకాశం కూడా ఉంది.