- Advertisement -

పార్సెల్ ట్యాంపరింగ్ ముఠా..నకిలీలతో మార్పిడి!

- Advertisement -

గుజరాత్‌లో కేడి గ్యాంగ్ గుట్టు రట్టైంది. విలువైన మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లను లక్ష్యంగా చేసుకున్న పార్సెల్ ట్యాంపరింగ్ రాకెట్‌ను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ వెలికితీసింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఖరీదైన గ్యాడ్జెట్లను దొంగిలించి, వాటి స్థానంలో నకిలీ వస్తువులు పెట్టి రిఫండ్‌లు లేదా ఆర్డర్ క్యాన్సిలేషన్‌లకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

కొరియర్ కంపెనీ ఉద్యోగి ఒకరు ఆర్డర్ ట్యాంపరింగ్ అనుమానం వ్యక్తం చేయడంతో ఈ మోసం బయటపడింది. దర్యాప్తులో, సీల్డ్ పార్సెల్‌ను రెండు నిమిషాల్లోనే రసాయన ద్రావణంతో తెరవగలమని నిందితులు చూపించారని పోలీసులు వెల్లడించారు. విచారణ సమయంలో వారు పార్సెల్‌ను ఎలా తెరిచి, అసలు ఉత్పత్తిని తీసి, నకిలీని పెట్టి మళ్లీ సీల్ చేస్తారో ప్రత్యక్షంగా ప్రదర్శించారు.

నిందితులు పెట్రోల్‌లాంటి ద్రవాన్ని సిరంజ్‌లో నింపి ప్యాకేజింగ్ అంచుల వెంట వేయడంతో గ్లూ కరిగిపోయేది. ఆపై ప్లాస్టిక్ బ్యాగ్‌లోని స్మార్ట్‌ఫోన్ బాక్స్‌ను బయటకు తీసి, హెయిర్ డ్రయ్యర్‌తో శ్రింక్ ర్యాప్‌పై వేడి గాలి ఊదేవారు. ప్రత్యేక సాధనంతో బాక్స్ ప్లాస్టిక్ కవరింగ్‌ను కట్ చేసి, ఐఫోన్‌ను తీసి మరో నకిలీ ఫోన్‌ను పెట్టి, మళ్లీ అసలు కూరియర్ బ్యాగ్‌లో ప్యాక్ చేసేవారు.

దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముఠా అహ్మదాబాద్, వడోదర, సూరత్‌తో పాటు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ సమన్వయంతో పనిచేసింది. కొరియర్ కంపెనీల్లో డెలివరీ సిబ్బందిగా తమ అనుచరులను చొప్పించారు. నకిలీ ఐడీలు, చిరునామాలతో ఖరీదైన ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు ఆర్డర్ చేసి, నిజమైన కస్టమర్‌కు చేరకముందే లోపలి వ్యక్తి పార్సెల్‌ను అడ్డుకునేవాడు. ఆపై ఖరీదైన గ్యాడ్జెట్‌ను తీసి, అదేలా కనిపించే నకిలీని పెట్టేవారు. అసలు ఆర్డర్‌ను తర్వాత క్యాన్సిల్ చేయించేవారు లేదా రిటర్న్‌గా చూపించేవారు. దొంగిలించిన అసలు ఉత్పత్తులను గ్రే మార్కెట్‌లో అమ్మేవారు.

కేవలం మూడు నెలల్లోనే ఈ ముఠా కనీసం 11 ఫోన్లు, 12 ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లు—మొత్తం సుమారు రూ.20 లక్షల విలువైనవి—దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటిలో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, మూడు ఐఫోన్ 16 ప్రో మోడళ్లు తదితర హైఎండ్ డివైస్‌లు ఉన్నాయి. జనవరి 28న నరోడాలోని కూరియర్ సంస్థ ఉద్యోగి ఒకరు తన ఆర్డర్‌కు సంబంధించిన పార్సెల్ క్యాన్సిల్ అయ్యి, అందులో నకిలీ ఫోన్ ఉన్నట్లు గుర్తించి ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడింది.

మరిన్ని కన్‌సైన్‌మెంట్‌లను పరిశీలించగా, ఐఫోన్లు, ఆపిల్ వాచ్‌లు సహా లక్షల విలువైన పరికరాలు మాయమైనట్లు తెలిసింది. ఈ రాకెట్‌కు సంబంధించి రామ్‌లాల్ గెహ్లోట్, మనోజ్ మాలి, భరత్ సుందేశా, విశాల్ పాంచాల్, విశాల్ బవారీని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎనిమిది అసలు ఫోన్లు, 25 నకిలీ ఫోన్లు, నకిలీ ఇయర్‌బడ్‌లు, గేమింగ్ ప్రాసెసర్లు, కెమెరా లెన్స్‌లు, హెయిర్ డ్రయ్యర్లు, ఒక కారు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా పలు నగరాల్లో ఇలాంటి మోసాలు చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -