ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో రూపకల్పనలో బిజీ కాగా బీజేపీ సైతం పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే ఇప్పటివరకు టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ కలిసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ దీనిపై క్లారిటీ రాలేదు.
గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ఒంటరిగా పోటీ చేయగా జనసేన, సీపీఐ, సీపీఐ(ఎం), బీఎస్పీ కలిసి పోటీ చేశాయి. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ – జనసేన ఎన్నికలకు ముందుగానే జట్టుకట్టాయి. ఇక ఈ కూటమిలో బీజేపీని చేర్చేందుకు పవన్ విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా చంద్రబాబు మాత్రం లెఫ్ట్ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు.
దీంతో బీజేపీ పరిస్థితి ఒంటరి పోరే ఉండేలా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తును బీజేపీలోని కొందరు నేతలు వ్యతిరేకిస్తుండగా మరికొందరు నేతలు సమర్ధిస్తున్నారు. అయితే కొంతమంది నేతలు మాత్రం పొత్తుల అంశం బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని చెబుతున్నారు. అయితే పొత్తుల అంశంపై వచ్చే ఏడాది జనవరి తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.