తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగింది జనసేన.తొలుత 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించినా బీజేపీతో పొత్తులో 8 స్థానాల్లో పోటీ చేసింది. ఇందులో ప్రధానంగా సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి, శేరిలింగంపల్లి ఉండటంతో ఈ స్థానంలో ఖచ్చితంగా ప్రభావం చూపుతామని భావించింది. కానీ తీరా ఎన్నికల ఫలితాలను చూస్తే జనసేన తుస్సు మంది. కొన్నిచోట్ల కనీసం నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. ఇప్పుడు ఇదే జనసేన పవన్ సామర్థ్యానికి పెద్ద పరీక్షగా మారింది.
త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనుండగా వైసీపీ దీనినే పదే పదే ప్రస్తావిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. పవన్ పరువును తీస్తూ ఏపీలో జనసైనికులకు సవాల్ విసురుతున్నారు వైసీపీ నాయకులు. సామాన్యురాలైన బర్రెలక్కకు వచ్చిన ఓట్లను పవన్ పార్టీ సాధించలేకపోయిందని మండిపడుతున్నారు. కొల్లాపూర్ నుండి పోటీ చేసిన బర్రెలక్క దాదాపు 6 వేల ఓట్లు సాధించగా పవన్ పార్టీ అభ్యర్థులకు ఆ మాత్రం ఓట్లు కూడా రాలేదు. ఏపీలో కూడా జనసేనకు ఇవే ఫలితాలు రిపీట్ కావడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. హైదరాబాద్లో ఇల్లు ఉన్న పవన్కు అత్తారింటికి దారేదో తెలియాలి అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
వాస్తవానికి ఈ విషయంలో చంద్రబాబును అభినందించాలి. ఎందుకంటే తెలంగాణలో గెలిచేది లేదు డిపాజిట్ వచ్చేది లేదని గమనించే ఆయన పోటికి దూరమయ్యారన్నది బహిరంగ రహస్యమే. ఇందులో బాబు రాజకీయ అనుభవం ఆయనకి ఉపయోగపడగా పవన్ మాత్రం మరోసారి తన రాజకీయ అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టుకున్నారని పలువురు అబిప్రాయపడుతున్నారు.