ఎట్టకేలకు ఏపీకి చేరుకోనున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో ఏ14గా లోకేష్ని చేర్చగా అక్టోబర్ 4న విచారణకు హాజరుకావాలని ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు రేపు ఏపీకి చేరుకోనున్నారు లోకేష్. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని నేషనల్ మీడియా ద్వారా లేవనెత్తే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది.
అయితే లోకేష్ ఢిల్లీకి వెళ్లింది చంద్రబాబు అరెస్ట్ ప్రస్తావనను వ్యతిరేకించే వారిని ఒకతాటిపైకి తేవడం కోసమే అయినా అవినీతి కేసుల్లో అరెస్ట్ నుండి తప్పించుకునేందుకేనన్న అపవాదు కూడా ఉంది. ఢిల్లీ నుండి టీడీపీ నేతలకు చంద్రబాబు అరెస్ట్ని ఖండిస్తూ మార్గనిర్దేశం చేసినా స్వయంగా ఆందోళనల్లో పాల్గొనలేదు.
ఇక తాజాగా లోకేష్ సీఐడీ విచారణకు వస్తుండటంతో ఆయన్ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే లోకేష్ని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగియనుండగా విచారణ అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఇదే కేసులో ఏ2గా ఉన్న నారాయణను సైతం రేపే విచారించనుంది సీఐడీ. అయితే వీరిద్దరిని కలిపి ఒకేసారి విచారిస్తారా లేదా వేర్వేరుగా విచారిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.