ఎట్టకేలకు బీజేపీ పెద్దలను కలిసే అవకాశం వచ్చింది చంద్రబాబు తనయుడు,టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు. బాబు రిమాండ్ తర్వాత 20 రోజులకు పైగా ఢిల్లీలోనే మకాం వేశారు లోకేష్. అయితే అప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసే అవకాశం రాలేదు. కానీ తాజాగా ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిశారు లోకేష్. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ తో పాటు ఏపీలో రాజకీయ పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా బాబు బెయిల్కు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.
ఇక ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ను మూడు సార్లు పొడగించారు. అక్టోబర్ 19 వరకు రిమాండ్లోనే చంద్రబాబు ఉండాల్సిన పరిస్థితి రాగా ఈ శుక్రవారం బాబు బెయిల్కు సంబంధించి విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. ఈ క్రమంలోనే లోకేష్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన నేపథ్యంలో బాబుకు బెయిల్ రావడం పక్కా అనే చర్చ మొదలైంది. లోకేష్తో పాటు అమిత్ షాను కలిసిన వారిలో కిషన్ రెడ్డితో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఉన్నారు.
అమిత్ షాతో భేటీ తర్వాత లోకేష్లో ఆనందం కనిపించడంతో టీడీపీ నేతలు బాబు బయటికి రావడం ఖాయమని చెబుతున్నారు. 32 రోజులుగా చంద్రబాబు రిమాండ్లో ఉండగా ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పేరు మోసిన లాయర్లు రంగంలోకి దిగినా అవినీతి కేసుల్లో చంద్రబాబు హస్తం ఉండటం, దానికి సంబంధించిన ఆధారాలు పక్కాగా సేకరించడంలో సీఐడీ సఫలం కావడంతో చిక్కులు తప్పలేదు. అయితే తాజాగా లోకేష్ హస్తినలో షాను కలిసిన నేపథ్యంలో బాబుకు బెయిల్ రావడం పక్కా అని చర్చ జరుగుతున్నా ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ శుక్రవారం వరకు వేచిచూడాల్సిందే.