టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జోరుగా నడుస్తున్నాయి. దాదాపు 50కి పైగా సీట్లను అడుగుతోంది జనసేన. అయితే 30 సీట్లు పవన్ పార్టీకి ఇచ్చేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేస్తోంది. అయితే ఇప్పుడు టీడీపీ ఇచ్చే ఆ 30 స్ధానాలు ఏంటనే దానిపై ఈ రెండు పార్టీల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
అయితే సీట్ల సంఖ్య ఎన్ని అనే అంశం పక్కనపెడితే తమకు ఖచ్చితంగా ఆ మూడు సీట్లు కావాలని పట్టుబడుతున్నారట పవన్. కడప జిల్లాలోని రాజంపేట, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాలు పొత్తులో భాగంగా తమకే కేటాయించాలని పవన్ చెప్పారట. ఎందుకంటే జగన్ సొంత జిల్లాలో పాగా వేయడం ద్వారా ఆయనపై పైచేయి సాధించడం ఒక ఎత్తైతే బలిజ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం మరో స్ట్రాటజీ.
రాయలసీమలో బలిజల జనాభా చాలా ఎక్కువ. జనసేన తరపున బలిజ సామాజికవర్గం నేతలను పోటీలోకి దింపితే గెలుపు ఖాయమని లోకల్ లీడర్లు లెక్కలేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే రాజంపేటలో శ్రీనివాసరాజు, బలిజ యువనేత దినేష్ జనసేన నుండి బరిలోకి దిగేందుకు ఆసక్తికనబరుస్తున్నారు .అంతేగాదు దినేష్ ..బద్వేలును ఓ చుట్టు చుట్టేసి వచ్చారు. అలాగే రాజంపేటలో విజయజ్యోతి, మైదుకూరులో సుధాకర్ యాదవ్ జనసేన నుండి పోటీచేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పవన్ కూడా ఈ మూడు సీట్లు తమకే కావాలని పట్టుబడుతున్నారని టాక్. మరి టీడీపీ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి..
ఇక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా గ్లాసునే కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. కొన్ని నెలల కిందట దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల గుర్తులను రద్దు చేసింది ఎన్నికల సంఘం. ఇలా జనసేన గ్లాస్ గుర్తును కొల్పోగా తాజాగా అదే గుర్తును జనసేనకు కేటాయించింది ఈసీ. 2019లో తెలుగు రాష్ట్రాల్లో పోటీచేసిన జనసేన ఒకే స్ధానంలో గెలిచింది. పవన్ రెండు చోట్ల పోటీచేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.