జనసేనాని పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర నేటి నుండి ప్రారంభంకానుంది. కృష్ణ జిల్లా అవనిగడ్డ నుండి వారాహి యాత్ర ప్రారంభంకానుండగా తొలిసారి టీడీపీ నేతలు ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఇక ఇప్పటికే పవన్ వారాహి యాత్రలో పాల్గొనాలని నారా లోకేష్, బాలకృష్ణ పిలుపునివ్వగా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొనే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం జరిగే భారీ బహిరంగసభలో పవన్ ప్రసంగించనుండగా ఆయన ఏం మాట్లాడుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పవను నాలుగో విడత వారాహి యాత్రం ఐదు రోజుల పాటు సాగనుంది. అవనిగడ్డ తర్వాత మచిలీపట్నం చేరుకుని అక్టోబర్ 2, 3 తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అక్టోబర్ 2న కృష్ణా జిల్లా జనసేన నాయకులతో, అక్టోబర్ 3న జనవాణి కార్యక్రమంలో పాల్గొననున్నారు.. అక్టోబర్ 4న పెడన, అక్టోబర్ 5న కైకలూరు నియోజకవర్గాల్లో వారాహి యాత్ర ఉండనుంది.
టీడీపీతో పొత్తు తర్వాత పవన్ చేస్తున్న తొలియాత్ర కావడంతో ఆయన ఏం మాట్లాడుతారోనని ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక పవన్ మాట్లాడితే టార్గెట్ జగనే.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ దాడిని మరింత పెంచే అవకాశం ఉంది. తెలుగు తమ్ముళ్ల మద్దతు కూడా ఉండటంతో వారిలో మరింత జోష్ నింపేలా పవన్ ప్రసంగం ఉండే అవకాశం ఉంది. అయితే పవన్ విమర్శలను అంతే ఘాటుగా తిప్పికొట్టేందుకు వైసీపీ నేతలు రెడీ అవుతున్నారు. మొత్తంగా పవన్ వారాహి యాత్రతో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.