వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ అధిష్టానం తొలుత షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా తర్వాత రాజకీయ సమీకరణలు మారడంతో ఆమెను వదులుకునేందుకు సిద్ధమైంది కాంగ్రెస్.
ఈ నేపథ్యంలో హడావిడిగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన షర్మిల…119 స్ధానాల్లో పోటీచేస్తానని ప్రకటించారు. అంతేగాదు ఈ ఎన్నికల్లో తాను రెండు చోట్ల నుండి పోటీ చేస్తానని అలాగే బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇంతవరకు బాగానే ఉన్న వాస్తవానికి షర్మిల టార్గెట్ కేసీఆర్,బీఆర్ఎస్. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ తనని నమ్మి నట్టేట ముంచిందని భావించిందో అంతే తన బాణాన్ని కాంగ్రెస్పై గురిపెట్టారు.
ఇక నుండి తన టార్గెట్ బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ పార్టీ అని పార్టీ నేతలతో చెప్పినట్లు సమాచారం. 119 స్ధానాల్లో షర్మిల పోటీ చేసిన అన్ని స్ధానాల్లో ప్రభావం చూపలేకపోయినా కొన్ని స్ధానాల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చే అవకాశం ఉంది. మాల మాదిగ సామాజిక వర్గాల్లో కాంగ్రెస్కు ఇప్పటికి ఓటు బ్యాంకు ఉండగా దీనిని ఖచ్చితంగా షర్మిల బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఇది కన్ఫామ్గా బీఆర్ఎస్కే లబ్ది చేకూరే అవకాశాలే ఎక్కువ. ఇక తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పాటు బీజేపీ,కాంగ్రెస్,వైఎస్ఆర్టీపీ, మజ్లిస్,ఆప్,బీఎస్పీ,తెలంగాణ జనసమితి,శివసేన,జనసేన,టీడీపీ,షర్మిల పార్టీ వైఎస్ఆర్టీపీ ఇన్ని పార్టీలు పోటీ చేస్తుండగా ప్రధాన పోరు మాత్రం బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్యనే ఉండనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.