టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత తొలిసారి ప్రజాక్షేత్రంలోకి రానున్నారు జనసేన అధినేత పవన్. అక్టోబర్ 1 నుంచి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి పవన్ నాలుగో విడత వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. అయితే ఈసారి వారాహి యాత్రలో టీడీపీ నేతలు,కార్యకర్తలు పాల్గొననున్నారు. అక్టోబర్ 6వతేదీ వరకు యాత్ర కొనసాగనుండగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ చేపట్టిన యాత్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగనుంది. ఇప్పటికే వైసీపీ పై పవన్ నిప్పులు చెరుగుతుండగా టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత ఆయన తన మాటల దాడిని మరింత పెంచే అవకాశం ఉంది.
ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో లోకేశ్, బాలకృష్ణలతో కలిసి పవన్ ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత పొత్తును కన్ఫామ్ చేయగా వారాహి యాత్ర ద్వారా పవన్ ఏం మాట్లాడుతారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే పవన్ మూడో విడత వారాహి యాత్ర వరకు కేవలం జనసేన పార్టీ శ్రేణులు, పవన్ అభిమానులు మాత్రమే పాల్గొనగా ఈసారి టీడీపీ నేతలు పాల్గొంటుండటంతో రాజకీయాలు మరింత హీట్ ఎక్కే అవకాశం కనిపిస్తోంది.
అయితే టీడీపీ,జనసేన నేతలు చేసే విమర్శలకు ఘాటుగా రిప్లై ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే పవన్ అంటేనే మందుండే రోజా, కొడాలి నాని, పేర్ని నాని గట్టిగా కౌంటర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వారాహి యాత్ర ఖచ్చితంగా పొలిటికల్ హీట్ పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.