ఏపీకీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తెగేసి చెప్పినా ఇ్పపటికీ రాష్ట్రంలోని పార్టీలు పోరాటం చేస్తున్నాయి.14 వ ఆర్థిక సంఘం పేరుతో రాష్ట్రాని హోదా లేకుండా చేశారని చేస్తున్న ఆరోపనలకు 15 వ ఆర్థిక సంఘం ఛైర్మెన్ ఎన్కే. సింగ్ చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చాయి.15వ ఆర్థిక సంఘం ఈరోజు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది.
గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు పునర్విభజన కోసం ప్రత్యేక ఇంప్లిమెంటేషన్ మెకానిజం ఉండేదని, ఇందు కోసం ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ బాధ్యత తీసుకునేవారని చెప్పారు. కానీ, ఏపీ పునర్విభజన చట్టం అమలుకు ఎలాంటి పర్యవేక్షణ వ్యవస్థ లేదని తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వకుండా తప్పించేందుకు 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపారని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టం అమలుకు పర్యవేక్షణ వ్యవస్థ లేదని చెప్పారు. ప్రత్యేక హోదా అంశం 15వ ఆర్థిక సంఘం పరిధిలోకి రాదని తెలిపారు. రెవెన్యూ లోటు భర్తీపై ఏపీ ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పారు. ఏపీ విభజన బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పుడు తాను కూడా రాజ్యసభలో ఉన్నానని తెలిపారు.
ఎన్కే సింగ్ చేసిన వ్యాఖ్యలు కేంద్రంలో బీజేపీ సర్కారును ఇరుకున పెట్టేలా ఉన్నాయి. ఇన్ని రోజులూ ఆర్థిక సంఘాన్ని బూచీగా చూపి హోదా విషయంలో ఏపీని కేంద్రం ఎలా మోసం చేసిందో ప్రజలకు వివరించడానికి సీఎం చంద్రబాబు నాయుడుకు పదునైన ఆయుధం లభించినట్లైంది.