భారత రత్న మీద మన నాయకులకి ఎప్పుడూ మోజే .. ఎన్టీఆర్ చనిపోయిన నాటి నుంచీ ఆయనకి భారతరత్న ఇవ్వాలి అంటూ టీడీపీ చెయ్యని ప్రయత్నమే లేదు. రెండు మూడు సార్లు తమ మిత్ర పక్షం బీజేపీ హై కమాండ్ లో డిల్లీ లో పాలన చేసినా ఎన్టీఆర్ కి ఒక భారతరత్న ఇప్పించుకోలేక పోయారు వారు .. ఇప్పుడు ఎన్టీఆర్ భారతరత్న కి పోటీగా జయలలిత భారతరత్న వచ్చి చేరింది.
అవును ఇప్పుడు ఆమెకి భారతరత్న ఇవ్వాలి అంటూ గొడవ మొదలెట్టారు;. దివంగత ముఖ్యమంత్రి జయలలితను ఘనంగా స్మరించుకునే క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. జయ మరణం అనంతరం పదవీ వారసుడిగా బాధ్యతలు చేపట్టిన అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం సారథ్యంలో తొలిసారి సమావేశమైన తమిళనాడు మంత్రివర్గం జయలలితకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలని తీర్మానం చేసింది.
అలాగే ఎంజీఆర్ మెమోరియల్ను భారతరత్న డాక్టర్ ఎంజీఆర్ మరియు జయలలిత మెమోరియల్గా మార్చాలని తమిళనాడు కేబినెట్ తీర్మానించింది. దీంతోపాటు ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో జయ కాంస్య విగ్రహం ఏర్పాటుపై తీర్మానం చేశారు. విగ్రహం ఏర్పాటుపై కేంద్రాన్ని కోరాలని కేబినెట్ తీర్మానం చేసింది. రూ. 15 కోట్లతో జయలలిత స్మారక భవనం నిర్మించాలని నిర్ణయించింది. తాజా వివరాల ప్రకారం కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీచేసింది.