బాంద్రా నియోజకవర్గపు ఉప ఎన్నికల్లో ఆసక్తి కరమైన ఫలితాలు వచ్చాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొంత కాలమే అయిన నేపథ్యంలో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో శివసేన జయకేతనం ఎగరేసింది. తన నియోజకవర్గాన్ని తిరిగి నిలబెట్టుకొంది. భారతీయ జనతా పార్టీ శివసేనకే మద్దతు ప్రకటించిన ఈ నియోజకవర్గపు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పలేదు. ఆ పార్టీ తరపు పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే ఓటమి పాలయ్యారు.
విశేషం ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓటమి తప్పకపోయినా… గతంతో పోలిస్తే కొంత మెరుగైన పరిస్థితి కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈనియోజకవర్గంలో కాంగ్రెస్ పడ్డ ఓట్లు కేవలం 12 వేలు కాగా.. ఇప్పుడు పరిస్థితి మెరుగు పరుచుకొని దాదాపు 31 వేల ఓట్లను దక్కించుకొంది. ఇదే సమయంలో బీజేపీ పోటీలో లేకపోవడంతో శివసేనకు పడ్డ ఓట్లు పెరిగాయి. ముదుసారి ఐదు వేల ఓట్లతో గెలిచిన శివసేన.. ఈ సారి 20 వేల ఓట్ల మెజారిటీని సాధించింది.
ఇక ఈ సారి ఎమ్ ఐఎమ్ కు ఈ నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థికి 23 వేల ఓట్లు పడగా.. ఇప్పుడు కేవలం 11 వేల ఓట్లు పడ్డాయి! దాదాపు సగానికి సగం ఓట్లను కోల్పోయింది మజ్లిస్ పార్టీ. దీంతో ఈ పార్టీకి ముస్లింలే ఓటేయలేదని శివసేన నేతలు ఎద్దేశా చేస్తున్నారు. విజయంసాధించకపోయినా.. కాంగ్రెస్ పరిస్థితి కొంత మెరుగుపడటం విశేషం.