అర్జున్రెడ్డి సినిమా విడుదల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు చేసిన పని సర్వత్రా చర్చానీయాంశమైంది. అప్పుడు వీహెచ్ అర్జున్రెడ్డి సినిమా పోస్టర్లను చించివేసిన ఘటనపై హీరో విజయ్ దేవరకొండ స్పందించి చిల్ తాతయ్య అని తనదైన శైలిలో స్పందించాడు. అయితే అప్పుడు సినిమా వాళ్లపై వీహెచ్ విమర్శించిన తీరు అందర్నీ నవ్వులు పూయించింది. ఇప్పుడు వీహెచ్ మరోసారి సినిమా వాళ్లపై మండిపడ్డారు.
సినిమా వాళ్ల సభలకు అనుమతి ఇస్తారు.. ప్రజల సమస్యలపై పోరాడే కోదండ రామ్లాంటి వారికి అనుమతి ఇవ్వరా అని వీహెచ్ సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వీహెచ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం దొరల పాలన జరుగుతోందన్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తానని ప్రకటించి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.
డబ్బుల సంపాదన కోసం సినిమాలు తీసే వారికి స్టేడియాలు ఇస్తున్నప్పుడు, తెలంగాణ ప్రజా సమస్యలపై పోరాడే కోదండరామ్ సభకు అనుమతి ఎందుకు ఇవ్వరని సీఎంను సూటిగా ప్రశ్నించారు. కోదండరామ్ రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు అనుమతి ఇవ్వడం లేదంటే కేసీఆర్ పరిపాలన అంతిమ దశకు చేరుకుందని అన్నారు. రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా తనకు ప్రశ్నించే హక్కు ఉందని వీహెచ్ స్పష్టం చేశారు.
కోదండ రామ్ తెలంగాణ జన సమితి పార్టీని స్థాపించారు. పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించుకోవడానికి ప్రభుత్వ ఎక్కడా అనుమతి ఇవ్వకపోవడంపై వి.హనుమంతరావు తనదైన శైలిలో స్పందించారు.