న్యూఢిల్లీ: నోట్ల రద్దు నేపథ్యంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశ వ్యాప్థంగా ప్రజలు పలు ఇబ్బందులు పడుతుంటే వాటిని తగ్గించేందుకు ఉపశమన మార్గాలు వెతుకుంది కేంద్రం. తాజాగా పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటివారు రెండున్నర్ర లక్షల వరకు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ఇందుకు వధువరుల అకౌంట్ నుంచి గానీ లేదా వారి తల్లిదండ్రుల అకౌంట్ నుంచి గానీ డ్రా చేసుకోవాలి. ఈ సమయంలో గర్తింపు కార్డుతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ను చూపించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సాలరీ అడ్వాన్స్ కింద పది వేల రూపాయిలు విత్డ్రా చేసుకునేందుకు అవకాశమిచ్చారు.
ముఖ్యంగా పెద్ద నోట్ల మార్పిడి విషయంలో అంతకుముందున్న నాలుగున్నర్ర వేల పరిమితిని ఇప్పుడు రెండు వేలకు తగ్గించేశారు. ఒక్కొక్కరు పలుమార్లు బ్యాంకులకు వస్తుండటంతో అలా కాకుండా ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్ధిక శాఖ కార్యదర్శి శక్తి కాంత దాస్ తెలిపారు. ఈ కొత్త నిర్ణయాలు నవంబర్ 18వ తేదీనుంచి అమలౌతాయి. అదే రైతులైతే పంట లోన్లకు చెందిన డబ్బును వారంలో రూ. 25 వేల వరకూ డ్రా చేసుకోవచ్చు. విత్తనాలు, ఎరువులు కొనేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శక్తి కాంత దాస్ చెప్పారు. పంట భీమా ప్రీమియం చెల్లింపు గడువును మరో 15 రోజుల పాటు పొడిగించినట్టు ఆయన తెలిపారు.