ఆంధ్రప్రదేశ్కు విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర ఎంపీలు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ విషయంపై ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ స్పందించారు. అంశాన్ని ప్రస్తావించిన ఆయన.. రాష్ట్ర విభజన సమయంలోనే ఆంధ్రా ఆర్థికంగా నష్టపోతుందని తెలుసన్నారు.
ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్పై వివరణ ఇస్తూ ఈ రోజు జైట్లీ ప్రసంగం చేస్తోన్న నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శినతోపాటు పలు అంశాలపై వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో నినాదాలతో హోరెత్తించారు. గందరగోళం మధ్యనే అరుణ్ జైట్లీ ఏపీ గురించి మాట్లాడారు. ఏపీకి ఇచ్చిన హామీల్లో ఇప్పటికే తాము కొన్ని అమలు చేశామని, మరికొన్ని అమలు దశలో ఉన్నాయని తెలిపారు.
ఏపీకి పలు జాతీయ సంస్థలను కేటాయించామని వాటికి నిధులు ఇస్తున్నామని అరుణ్ జైట్లీ తెలిపారు. ఏపీ రాజధాని నిర్మాణానికి వెనుకబడిన జిల్లాలకు కూడా కొన్ని నిధులు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే పోలవరానికి పలుసార్లు నిధులు ఇచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అధికారులు నిన్నటి నుంచి చర్చలు కూడా జరుపుతున్నారని అన్నారు. రైల్వే జోన్ కు సంబంధించి కొన్ని విషయాలు తేలాల్సి ఉందని అన్నారు.
రెవెన్యూ లోటుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఏపీకి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని అరుణ్ జైట్లీ చెప్పారు. అప్పట్లో తాము రాష్ట్ర విభజనకు మద్దతిచ్చినప్పటికీ, ఏపీకి హక్కుల కోసం కూడా అప్పట్లో పోరాడామని చెప్పారు. అదే సమయంలో లోక్సభలో మరింత గందరగోళం చెలరేగడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.