కమ్యూనికేషన్ల రంగంలో భారత్ కొత్త పుంతలు తొక్కనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్ఎల్వీ-ఎఫ్08 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షానికి పంపించింది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం (మార్చి 29) సాయంత్రం సరిగ్గా 4.56 గంటలకు జీశాట్-6ఎ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది.
జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్08.. భారత్ అభివృద్ధి చేసిన రాకెట్లలో రెండో అతిపెద్దది. ఈ జీఎస్ఎల్వీ మార్క్-2 శ్రేణి రాకెట్ను ప్రయోగించడం ఇది 12వ సారి. స్వదేశీ క్రయో ఇంజిన్తో ప్రయోగాన్ని చేపట్టడం ఇది ఆరోసారి కావడం విశేషం. 2014 జనవరి తర్వాత వరసగా నాలుగు సార్లు ఈ రాకెట్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. తాజాగా ఐదోసారి కూడా విజయవంతమవడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ.. ఇస్రో ఛైర్మన్ కె. శివన్తో పాటు ప్రయోగంలో పాల్పంచుకున్న శాస్త్రవేత్తలను అభినందించారు.
ఇందులోని విచ్చుకునే సామర్థ్యమున్న 6 మీటర్ల ఎస్-బ్యాండ్ యాంటెన్నా, చేతిలో ఇమిడిపోయే భూతల టెర్మినళ్లు, నెట్వర్క్ నిర్వహణ విధానాలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాంకేతిక సత్తాకు నిదర్శనం. తాజాగా ప్రయోగిస్తోన్న జీశాట్-6ఏ ఉపగ్రహాల ద్వారా నడిచే మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థకు మరింత బలం చేకూర్చుతుంది. ఇందుకోసం ఇస్రోకి రూ. 270 కోట్లు ఖర్చు అయింది. ఈ ఉపగ్రహంలో ఇస్రో ప్రత్యేకమైన యాంటెనాను అమర్చింది.
ఇస్రో చేసిన ప్రయోగాల్లో వినియోగించిన యాంటెనాలకు ఇది విభిన్నమైంది. మిలటరీ అవసరాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. మరో 17 నిమిషాల 46 సెకన్ల వ్యవధిలో నిర్ణీత కక్ష్యలోకి జీశాట్-6ఏ ఉపగ్రహం చేరుతుంది.