అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు శిక్ష ఖరారైంది. ఈ కేసులో అతడికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ.. సీబీఐ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గుర్మీత్ను దోషిగా తేల్చుతూ తీర్పు చెప్పిన అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల దృష్ట్యా రోహ్తక్ జైలులోనే ఓ ప్రత్యేక గదిలో న్యాయ విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ జగ్దీప్ సింగ్ ఈ మేరకు శిక్షను ఖరారు చేశారు.
జైల్లో ప్రొసీడింగ్స్ ముగిశాక న్యాయమూర్తి తీర్పు వెలువరించారు…. తమ వాదనలు వినిపించేందుకు ఇరు పక్షాలకు చెరో పది నిమిషాల సమయం కేటాయించారు న్యాయమూర్తి… ప్రాసిక్యూషన్తో పాటు రామ్ రహీమ్ తరఫు న్యాయవాదులు తమ వాదన వినిపించారు… బాబాకు పదేళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది… బాబా ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు తక్కువ శిక్ష విధించాలని డిఫెన్స్ న్యాయవాదులు విన్నవించారు. తాను సామాజిక సంస్కర్తను అని, తనకు తక్కువ శిక్ష విధించాలని కోర్టును బాబా అభ్యర్థించారు.
కోర్టు తీర్పును చదువుతున్న సమయంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి పలు అంశాలను ప్రస్తావించారు. ఇది క్షమించరాని నేరమని అన్నారు. నమ్మివచ్చిన అమాయకులపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్పు విన్న వెంటనే గుర్మీత్ బాబా కన్నీటి పర్యాంతమయ్యారు. ఇది ఇలా ఉండగా, గుర్మీత్కు పదేళ్ల జైలు శిక్ష సరిపోదని, జీవిత ఖైదు వేయాలని అత్యాచార బాధితురాలు డిమాండ్ చేశారు.
శిక్ష విధించిన నేపథ్యంలో బాబా అనుచరులు మరోసారి అల్లర్లకు తెగబడకుండా ఉండేందుకు రోహ్తక్ జైలు చుట్టూ వేలాదిమంది ఆర్మీ జవాన్లను మోహరించారు. అయినపన్పటికి అనుచరులు వీరంగం సృష్టించారు. కొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు.ఇప్పటికే శుక్రవారం హింసాకాండతో అభాసు పాలైన హర్యానా సర్కార్ ఈసారి పరిస్థితి విషమించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.