అక్రమాస్తుల కేసుకు సంబంధించి వైసీపీ అధినేత జగన్ ప్రతీ శుక్రవారం నాంపల్లి కోర్టునుంచి ఊరట లభించింది. గురువారం విశాఖ ఎయిర్పోర్టులో జగన్ దాడికి గురైన నేపథ్యంలో.. ఈసారికి ఆయనకు మినహాయింపునివ్వాలని జగన్ తరుపు న్యాయవాది శుక్రవారం కోర్టును కోరారు.
ఆసుపత్రిలో ఉన్నందున జగన్ కోర్టుకు రాలేడని జగన్ తరుపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. న్యాయవాది విజ్ఞప్తి మేరకు నాంపల్లి సీబీఐ కోర్టు జగన్కు మినహాయింపునిచ్చింది. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్న క్రమంలో జగన్పై శ్రీనివాస్ అనే యువకుడు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే.
ప్రస్తుతం జగన్, సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని జగన్ న్యాయవాది వెల్లడించగా, ఆయన ఆరోగ్యం ఎలా ఉందని న్యాయమూర్తి అడిగినట్టు తెలుస్తోంది. ఆపై జగన్ కు నేటి విచారణ నుంచి మినహాయింపును ఇస్తున్నట్టు జడ్జి తెలిపారు.
హైదరాబాద్కు వస్తున్న జగన్పై విశాఖ ఏయిర్పోర్టులో శ్రీనివాస్ అనే వ్కక్తి పదునైన ఆయుధంతోజగన్ భుజంపై అతను దాడి చేయడం తీవ్ర సంచలనం రేపింది. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని, కొందరు పెద్దల డైరెక్షన్లోనే దాడి జరిగిందని వైసీపీ ఆరోపిస్తుండగా.. దాడి చేసింది జగన్ అభిమానే అని టీడీపీ ఆరోపిస్తోంది. ఇదంతా నటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ ప్రకారమే జరుగుతోందని సీఎం చంద్రబాబు సైతం అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైతే దాడికి సంబంధించి స్పష్టమైన కారణాలేవి వెల్లడికాలేదు.