ఆంధ్రప్రదేశ్లో ఐటీ దాడులు సంచలనం రేపుతున్నాయి. గత కొన్ని రోజులగా ఐటీ అధికారులు ముమ్మరంగా ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తూ ఉత్కంఠ రేపుతున్నారు. ఇప్పటికే టీడీపీకీ చెందిన ప్రములు బీద మస్తార్ రావు, పార్టీ ఎంపీ రమేష్ ఇతర ప్రముఖలపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.
తాజాగా విశాఖపై ఐటీ అధికారులు గురి పెట్టారు. ఇందుకోసం బుధవారం రాత్రే భారీగా విశాఖపట్నం చేరుకున్న ఐటీ బృందాలు.. గురువారం ఉదయాన్నే తనిఖీలకు బయలుదేరాయి. ఎంవీపీ కాలనీలోని ఐటీ కార్యాలయం వద్ద సిద్ధంగా ఉన్న 50కి పైగా వాహనాల్లో అధికారులు
వివిధ ప్రదేశాల్లో తనిఖీలకు బయలుదేరారు.
గురువారం ఉదయం గాజువాక మండలం దువ్వాడ ఎస్ఈజెడ్లోని పలు సంస్థల్లో ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. లాజిస్టిక్ రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్న టీజీఐలో ఎనిమిది మంది అధికారులతో కూడిన బృందం సోదాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థకు చెందిన గొడౌన్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఇక తెలంగాణ టీడీపీ నేత దేవేందర్గౌడ్ బంధువులకు చెందిన టీజీఐ సంస్థలో ఎగుమతులకు సంబంధించి ఆదాయాల్లో అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం రావడంతో ఐటీ అధికారులు ఈ సంస్థపై కూడా దాడులు నిర్వహించారు. అలాగే ట్రాన్స్ వాల్ట్ బీచ్ శాండ్ సంస్థలోకి కొందరు అధికారులు ప్రవేశించారు. ఆక్వా కంపెనీలు, రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు, స్టార్ హోటల్ యజమానులు, నగల వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరగవచ్చని తెలుస్తోంది.
మరికొంతమంది ఐటీ అధికారులు అమరావతి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. విశాఖపట్నం దాడులకు అనుబంధంగానే ఏపీలోని పలు పట్టణాల్లో ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఐటీ దాడులతో టీడీపీ నేతలతోపాటు, ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.