20 ఏళ్లలో జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలపై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడి జరిగింది. భారీగా పేలుడు పదార్థాలు ఉపయోగించడంతో దారుణమైన విస్పోటనం జరిగింది.
ఈ ఉగ్రదాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. దీనిని ఓ పిరికిపంద చర్యగా అభివర్ణించారు ప్రధాని నరేంద్రమోదీ. అమరవీరుల కుటంబాలకు కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు నేతలు. ఈ ఘటనలో గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక ఈ దాడులు చేసిన ఉగ్రవాద సంస్థ ఏదైనా.. వారు పశ్చాతాపం పడేలా చేస్తామన్నారు కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ.
ఈ పేలుడు కోసం భారీగా ఐఈడీ వాడినట్లు తెలుస్తుంది. పేలుడు తర్వాత ఘటన ప్రాంతంలో తుపాకీ చప్పుళ్లు కూడా వినిపించాయి. ఈ దారుణ ఘటనకు తమదే బాధ్యత అని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు కాన్వాయ్లోకి కారును తీసుకెళ్లి తనను తాను పేల్చేసుకున్నట్లు తెలుస్తోంది. దాడి సమయంలో కాన్వాయ్లో మొత్తం 70 వాహనాలు ఉన్నాయి.
అయితే ఇంత భారీ స్థాయిలో ఐఈడీని సేకరించినా నిఘా సంస్థలు కనిపెట్టలేకపోవడం దారుణం. కాన్వాయ్ ఎప్పుడూ బయల్దేరుతుంది.. అందులో ఎంత మంది ఉన్నారు? అన్న విషయాలు వారికి ముందుగానే తెలిశాయని భద్రతాధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన ఆర్మీ.. త్వరలోనే గట్టి జవాబు ఇస్తుందన్నారు.