తన కడుపు మాడ్చుకుని పిల్లలకి అన్నం పెట్టేదే ‘ అమ్మ ‘ అంతటి స్థానాన్ని ఇచ్చారు తమిళనాడు జనాలు జయలలిత కి. ప్రతీ విషయంలో అమ్మా అమ్మా అంటూ ఆమె అసలు పేరునే ఎక్కడా వాడని జనాల కోసం జయలలిత ఈ వరదల హోరు లో చెన్నై వారికి ఏం చెయ్యడం లేదు అనే విమర్శలు తీవ్రతరం అయ్యాయి.
చెన్నై సహా తమిళనాడు తీవ్రంగా నష్టపోతుంటే.. ఆమె జాడ కనిపించని పరిస్థితి. ఇక.. చెన్నై మహానగరంలో దాదాపు 70 లక్షలకు పైనే ప్రజలు నరకం అనుభవిస్తుంటే.. అమ్మ బయటకు వచ్చింది లేదు.. ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించింది లేదు. ప్రభుత్వ యంత్రాంగం స్తబ్దు గా మారిపోయి ఆర్మీ రావాల్సిన పరిస్థితి దాపురించింది.
ప్రభుత్వ పెద్దలు అందరిలో చైతన్యం రగిల్చి పరుగులు తీయిస్తూ తాను కూడా పరుగులు పెడుతూ ఆపన్న హస్తం కోసం చూసే వారు అందరికీ చొరవ చూపించాల్సిన ఆవిడ కొండంత ధైర్యం ఇవ్వడం మాట అటు ఉంచి కనీసం కంటికి కనపడడం లేదు. ఐదారు రోజులుగా చెన్నై మొత్తం అగమాగమం అయినా కూడా ఆమె కనపడని పరిస్థితి. దారుణంగా దెబ్బ తింటున్న చెన్నై కి మోడీ దిగొచ్చి వెయ్యి కొట్లు ప్రకటించారు కానీ అమ్మ పెదవి విప్పలేదు, కాలు బయటకి పెట్టలేదు.
ప్రధాని మోడీ తమిళనాడులోని పరిస్థితిని చూసేందుకు వస్తున్నారన్న సమాచారం అందుకున్నాక కానీ.. జరిగిన నష్టంపై ఏరియల్ సర్వే నిర్వహించటానికి ఆమె బయటకి రావడం చూస్తుంటే అమ్మ అమ్మేనా అని చెన్నై జనాలు అనుమానిస్తున్నారు