తెలంగాణా లో తెరాస పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడేవారు చాలా మందే ఉన్నారు . కానీ ఎవ్వరికీ సరైన ప్లాట్ ఫారం లేకపోవడమే ఇబ్బందికర విషయం. ఇప్పటికే తెరాస సర్కారు మీద జనాలు విరిచుకుని పడుతున్న తరుణం లో తెలంగాణా రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆయన నేతృత్వం లో ఒక కొత్త కూటమిని తీసుకుని వస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి సెర్చ్ వారెంట్ లేకుండా ప్రజాగాయని విమలక్క అరుణోదయ సాంస్కృతిక మండలి కార్యాలయంలో సోదాలు నిర్వహించటమే కాకుండా సాధారణ పుస్తకాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేజేయటం దుర్మార్గమని కోదండరాం మండిపడ్డారు. తక్షణమే అరుణోదయ కార్యాలయాన్ని తెరవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణగా ఎదగాలని కోరుకున్నాం కానీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తే అయ్యే పనికాదు భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు.
విద్యార్థులనుండి ప్రారంభమైన మలిదశ పోరాట ఉద్యమానికి న్యాయవాదులు చివరివరకు వెన్నుదన్నుగా నిలవటం చారిత్రాత్మకమన్నారు. రిటైర్డ్ జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ వేరు అనుభవిస్తున్న తెలంగాణ వేరన్నారు. ప్రజాస్వామిక విలువలు పతనమవుతున్న వేళ మళ్లీ మంచి పాత్ర పోషించాల్సిన చారిత్రాత్మక సమయం ఆసన్నమయ్యిందన్నారు.
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు మాట్లాడుతూ తెలంగాణలో నిశ్శబ్ద పాలన కొనసాగుతుందన్నారు. సర్జికల్ దాడుల మాదిరిగా ప్రజలపై దాడులు జరుగుతున్నాయని అన్ని వర్గాలు ఐక్యమై తిప్పికొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. కోదండరాంపై మంత్రి కేటీఆర్ చేసిన వాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. కాగాప్రజాగాయని విమలక్క ప్రసంగానికి ముందు కంటతడి పెట్టుకున్నారు. ఎప్పుడూ సందడిగా ఉండే అరుణోదయ కార్యాలయానికి ఇన్ని సంవత్సరాల్లో ఎన్నడూ తాళం పడలేదని అందుకే బాధ అనిపించింది కానీ భయం కాదన్నారు. ఆఫీసుకు తాళాలు వేయొచ్చు కానీ తమ గొంతుకకు వేయలేరనీ ఆట మాట మాటతో ప్రజల్లోకెళ్తామన్నారు. కార్యక్రమంలో ప్రజాగాయకుడు గోరటి వెంకన్న పాత్రికేయుడు పాశం యాదగిరి న్యాయవాద జేఏసీ నేతలు పాల్గొన్నారు.