తెలంగాణలో జిల్లాల విభజన ప్రక్రియ ఓ ప్రహసనంలా సాగుతోంది. జిల్లాల విభజనకు సంబంధించి మండలాల సమస్యతో.. వ్యవహారం మరింత అలస్యమవుతోంది. అయితే.. దసరా నాటికి జిల్లాలను విభజించాలని పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకునేలాగే.. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. మండలాల విభజన, గ్రామాల విలీనంపై పూర్తి స్థాయి ప్రతిపాదనలతో రావాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించడంతో.. ప్రక్రియ వేగంగానే ముందుకు కదులుతున్నట్టు స్పష్టమవుతోంది.
తెలంగాణలో వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలను మొత్తం మూడు చొప్పున విడదీసే అవకాశం ఉంది. మిగిలిన ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను రెండు చొప్పున విడదీసేలా ప్రక్రియ కొనసాగుతోంది. ఓవరాల్ గా.. 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను.. మొత్తం 24 నుంచి 25 జిల్లాల రాష్ట్రంగా మార్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అందుతోంది.
కొత్త మండలాల ఏర్పాటు.. గ్రామాల విలీనంపై స్పష్టత రాగానే.. జిల్లాల విభజనపై ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ కూడా నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. తర్వాత.. పూర్తి క్లారిటీ రాగానే.. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు పని పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.