అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ల భేటీ తేదీ ఖరారైంది. సింగపూర్లో జూన్ 12వ తేదీన ఈ సమావేశం జరగనుందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ సమావేశం గురించి ఉ.కొరియా రాయబారి కిమ్ యోంగ్ చోల్తో వైట్హౌస్లోని ఓవల్ కార్యాలయంలో దాదాపు 80 నిమిషాల పాటు చర్చించిన అనంతరం ట్రంప్.. ఈ తేదీని ఖరారు చేశారు. ఈ సందర్భంగా కిమ్ జాంగ్ పంపిన లేఖను ట్రంప్ కు కిమ్ యోంగ్ చోల్ అందించారు.
కొరియాను అణు రహిత దేశంగా మార్చాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ట్రంప్, కిమ్ ల భేటీ జరగనుంది. అయితే అణురహిత దేశంగా కొరియాను మార్చడమన్నది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ అని ట్రంప్ అన్నారు. ఇది ఒక్క సమావేశంతోనే అయిపోయేది కాదని చెప్పారు.
ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెరగడం మంచి పరిణామమని అన్నారు. ఉత్తర కొరియా అభివృద్ధి చెందాలని భావిస్తోందని, వారు ఆశిస్తున్నది జరుగుతుందని తెలిపారు. వారు అభివృద్ధి చెందేందుకు ప్రయత్నిస్తున్నారని, అది జరుగుతుందనడంలో సందేహం లేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. కిమ్ జాంగ్ తో తన సమావేశం ఫలప్రదం అవుతుందని చెప్పారు.