ప్రతియేటా ఏదో ఒక పండుగకు ఏపీ ప్రభుత్వం సీఎం పేరు మీద చంద్రన్న కానుకలు అంటూ ప్రజలకు పంపిణీ చేస్తుంది. ఈ కానుకలు అన్నీ నాణ్యత లేకుండా.. గడువు దాటిన.. లేదా పాడైపోయిన ఆహార పదార్థాలు ఆ కానుకల్లో ఉంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పేరు మీద చంద్రన క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ కానుకలు అంటూ పంపిణీ చేస్తుంటారు.
వీటిని పౌరసరఫరాల దుకాణాల్లో రేషన్ కార్డుదారులకు అందిస్తుంటారు. అయితే వీటిని ప్రజలు చీత్కరిస్తున్నారు. తిరస్కరిస్తున్నారు. ఏ మాత్రం నాణ్యత లేనివి పంపిణీ చేస్తున్నారు. రూ.కోట్లు కొల్లగొట్టడానికి టీడీపీ మద్దతుదారులైన సరఫరాదారులు ప్రతయ్నతాలు చేస్తున్నారు. కమీషన్ల పర్వం తోడవడంతో నాణ్యత లేని.. నాసిరకం సరుకులు సరఫరా చేసేస్తున్నారు.
క్రిస్మస్, సంక్రాంతిని పురస్కరించుకొని కార్డుదారులందరికీ చంద్రన్న కానుకలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో చౌకధరల దుకాణాలు 27,847 ఉన్నాయి. వీటి పరిధిలో 1,38,88,547 రేషన్ కార్డులు ఉన్నాయి. వివిధ జిల్లాలకు వచ్చిన గోధుమ పిండి, నెయ్యిలో నాణ్యత లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు వాటిని తిరస్కరించడం కలకలం రేపుతోంది.
నాణ్యత లేని గోధుమ పిండి కర్నూలు జిల్లాతోపాటు కోస్తా జిల్లాలకు చేరింది. కర్నూలు జిల్లాలో కాసుల కక్కుర్తితో గుజరాత్ నుంచి నాసిరకం గోధుమ పిండిని దిగుమతి చేసుకున్నారని సమాచారం. నిబంధనల ప్రకారం ప్యాకింగ్ తేదీ నుంచి వ్యాలిడిటీ మూడు నెలలు ఉండాలి. కానీ కొన్ని ప్యాకెట్లపైన వ్యాలిడిటీ 2 నెలలు ఉండగా, కొన్నిటికి తయారీ తేదీ, వ్యాలిడిటీ డేట్ లేకపోవడం గమనార్హం.
కంపుకొడుతున్న నెయ్యి..
కర్నూలు, అనంతపురం జిల్లాలతోపాటు కోస్తా జిల్లాలకు సరఫరా చేసిన నెయ్యి కంపు కొడుతోంది. ఏ ఒక్కటీ నాణ్యతతో లేదని అధికారులే నిర్ధారించారు. నెయ్యి ప్యాకెట్లను వాపసు తీసుకొని.. తిరిగి మంచివి ఇవ్వాలని కోరారు. అయితే.. అధికారులు మాత్రం ఆవు నెయ్యి వచ్చింది.. అందువల్లే తిరస్కరించామని బయటికి చెబుతున్నారు.
అరకిలో బెల్లం ప్రత్యేకంగా ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఇస్తున్నారు. ఇది బంకలా సాగుతోంది. అది కూడా నల్లగా సారాయి బెల్లాన్ని తలపిస్తోంది. శనగ, కందిపప్పుల్లోనూ కల్తీ స్పష్టంగా కనిపిస్తోంది. వీటన్నిటి నేపథ్యంలో ప్రజలు చంద్రన్న కానుకలను తిరస్కరిస్తున్నారు. పైగా చంద్రన్న మాల్స్లలోనే కానుకలు ఇస్తుండడంతో ప్రజలు ఆసక్తి చూపడం లేదు. తాము తీసుకోమని తెగేసి చెబుతున్నారు.