మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులు తమ పంజా విసిరారు. తమకు పట్టున్న ప్రాంతాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది పనులకు వ్యతిరేకంగా మావోయిస్టులు చెలరేగిపోయారు. కాదని పనులు చేపడితే తీవ్ర నష్టం కలుగజేస్తున్నారు.గడ్చిరోలి జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంపై మావోయిస్టులు కన్నెర్ర చేశారు. దాదాపు 36 భారీ వాహనాలకు నిప్పు పెట్టారు. మరోసారి ఇక్కడ కనిపిస్తే ప్రాణాలు దక్కవని కార్మికులు, నిర్మాణ సిబ్బందిని హెచ్చరించారు. ఈ ఘటనలో 150 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం.
పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న మావోయిస్టులు తుపాకీలతో బెదిరించి కాంట్రాక్టర్లు, కార్మికులు, వాహనదారులను ఓ చోట బంధించారు. ఆ తర్వాత అన్ని వాహనాలపై పెట్రోల్, డీజిల్ పోసి తగులబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తాము ఈ చర్యకు పాల్పడినట్లు మావోయిస్టులు కరపత్రాలను వదిలిపెట్టారు. కాంట్రాక్టర్ల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న బలగాలు కూంబింగ్ ప్రారంభిచాయి.ఈ ఘటనతో దాదాపు రూ. 10కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు.