దేశమంతా.. నోట్ల మార్పిడిలో బిజీగా ఉన్న వేళ ఉప్పుకోసం ఉరుకులు పరుగులు పెట్టారు ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు. పట్టుమని పదిరూపాయల విలువైన చేయని ఉప్పును వందలకు వందలు పోసి కొన్నారు . ఉప్పు దొరకదంటూ.. మొదలైన పుకార్లతో జనం .. కిరాణ షాపుల ముందు క్యూ కట్టారు. ఈ వదంతులు హైదరాబాద్ కు కూడా పాకడంతో కొన్ని ప్రాంతాల్లో ఉప్పును కొనేందుకు ప్రజలు ఎగబడ్డారు.
ఉప్పు కొరత వస్తోందని. రాబోయే రోజుల్లో సాల్ట్ దొరకదంటూ.. ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్, కాన్పూర్, మొరాదాబాద్ లాంటి పెద్దపెద్ద నగరాల్లో పుకార్లు మొదలయ్యాయి. దీంతో జనమంతా.. ఒక్కసారిగా కిరాణా షాపులకు పరుగులు పెట్టారు. అంతే జనం ఆతృతను క్యాష్ చేసుకున్నారు వ్యాపారులు. కిలో 400 నుంచి 500 రూపాయల వరకు అమ్మారు. ఎంత పెద్ద బ్రాండ్ అయినా… కిలో 20 రూపాయలు మించని ఉప్పు… ఏకంగా 400కు పైగా పలకడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అంత ధర అయినా కొనేందుకు వెనకాడలేదు జనం.ఉప్పు కొరత పుకార్లు షికారు చేయగానే అసలు ఉప్పు కొరతే లేదని స్పష్టం చేసింది యూపీ సర్కార్. ఎమ్మార్పి కంటే ఒక్క రూపాయి ఎక్కువకు అమ్మినా…కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.యూపీలో ఉప్పుకొరత వార్తలపై కేంద్ర పౌరసఫరాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పందించారు. ఇలాంటి వార్తలతో ప్రజలను గందరగోళానికి గురి చేయొద్దన్నారు. పుకార్లు వ్యాప్తి చేస్తున్నవారిపై.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తంగా పుకార్లైనా మరింకే కారణమైనా… దేశంలో మొదటిసారిగా ఉప్పు ధర పచ్చనోటును దాటిపోయింది. పట్టుమని పదిరూపాయల విలువ కూడా లేని ఉప్పు.. వందలు దాటింది