ప్రధాని పెద్ద నోట్లను రద్దు చేయడంతో.. సామాన్యులు అష్టకష్టాలు పడ్డారు. చిల్లర కోసం ఇబ్బంది పడుతున్నారు. పాత నోట్లు ఎవరు తీసుకోవడం లేదు. ఆసుపత్రులు కూడా పాత నోట్లను తీసుకునేందుకు తిరస్కరించాయి. దీంతో రోగులు నానా అవస్థలు పడ్డారు. అయితే సహనంతో ఆలోచిస్తే సరైన ఉపాయం తడుతుందనడానికి ఈ వ్యక్తే సరైన ఉదాహరణ. కలకత్తాలోని పొద్దార్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో సుకంత్ చౌలే అనే డెంగ్యూ పేషెంట్ చికిత్స పొందుతున్నాడు.
అతనిని గురువారం డిశ్చార్జ్ చేయాల్సి ఉంది. డిశ్చార్జ్ చేయాలంటే 40వేలు కడితే చేస్తామని వైద్యులు చెప్పారు. 40వేలు కట్టినా వైద్యులు ఆ డబ్బు తీసుకోవడానికి నిరాకరించారు. అవి పాత నోట్లు. తన దగ్గర పాత నోట్లు తప్ప 40వేలకు సరిపడా చిల్లర లేదు. దీంతో ఏం చేయాలో సుకంత్ కు పాలుపోలేదు. కాస్త దీర్ఝంగా ఆలోచించిన అతనికి ఓ ఆలోచన తట్టింది. వెంటనే స్మార్ట్ ఫోన్ తీసి తన మిత్రులందరికీ
సోషల్ మీడియా మరియు, వాట్సాప్ కు ఓ మెసేజ్ పెట్టాడు. తన పరిస్థితి ఇలా ఉందని, చిల్లర ఉంటే దయచేసి ఇవ్వగలరని సందేశం పంపించాడు. అతని సందేశానికి అనూహ్య స్పందన వచ్చింది. కాయిన్లు వరదలా వెల్లువెత్తాయి. అతను సందేశం పంపిన గంటకే 40వేలు సమకూరాయి. 40 వేల చిల్లర నాణేలను ఓ బ్యాగ్ లో పెట్టుకుని ఉదయాన్నే ఆసుపత్రికొచ్చారు. ఆసుపత్రి యాజమాన్యం ఆ చిల్లర చూసి అవాక్కయ్యారు. అయితే ఈ చిల్లర తాము తీసుకోమని ఆసుపత్రి యాజమాన్యం పేచీ పెట్టింది. వాటికి బదులుగా బ్యాంక్ డ్రాఫ్ట్ ఇవ్వాలని కోరింది. అయితే ఆ చిల్లర వెనకున్న కథంతా చెప్పేసరికి యాజమాన్యం ఎట్టకేలకు అంగీకరించింది. ఆ చిల్లరనంతా కుప్ప పోసి ఆసుపత్రిలో లెక్కపెడుతుండగా ఓ చానల్ కెమెరామెన్ ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో జనం చిల్లర డబ్బును సంజీవనిగా భావిస్తుంటే, అయిన వారి కోసం అంత చిల్లర ఇవ్వడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Related