తెలంగాణా రాష్ట్ర సచివాలయం కూల్చివేత విషయం లో కెసిఆర్ సర్కారు చాలా గట్టిగా ఉంది. ఒక విషయం మీద ఫిక్స్ అయితే కెసిఆర్ తాను అనుకున్నది సాధించి తీరతారు. ఏ వ్యవహారం లో అయినా ఆయన ఒక గట్టి నమ్మకం లేకపోతే ముందు అడుగు వెయ్యరు ఒక్కసారి వేస్తే మాత్రం వెనక్కి తగ్గరు అనేది అందరికీ తెలిసిన విషయమే. కేవలం వాస్తు నమ్మకం ఆధారంగా కెసిఆర్ సెక్రటేరియట్ ని కూల్చే నిర్ణయం అందరికీ కోపం తెప్పిస్తోంది కానీ రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా ? అన్నట్టు ఉంది వ్యవహారం.
ఆయన జాతకం ప్రకారం వాస్తు బాలేదు కాబట్టి కూల్చేసి కోట్లు ఖర్చు పెట్టి కొత్తది కడతారు . రేప్పొద్దున్న ఇంకో నాయకుడు ముఖ్యమంత్రి అయితే, ఆయన జాతకమూ సచివాలయ వాస్తుకు సరిపోకపోతే.. మళ్లీ కూల్చి కొత్తది నిర్మిస్తారా..? ప్రజాధనానికి కాపలాగా ఉండాల్సిన ముఖ్యమంత్రే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఏమనుకోవాలి..? సరే, వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది కాబట్టి… అక్కడ వాస్తూ జాతకాలూ సెంటిమెంట్లూ అని చెబితే బాగోదు కాబట్టి, భద్రతా కారణాలను చూపింది తెరాస సర్కారు.
ఫైర్ సేఫ్టీ లేదని, అందుకే కూల్చి కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందంటూ అగ్ని మాపక సిబ్బంది ఇచ్చిన సర్టిఫికేట్ను కూడా తన వాదనకు జత చేసింది. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇప్పుడున్న సచివాలయాన్ని కొనసాగిస్తే మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్కు పట్టిన తగే పడుతుందని భయపడుతున్నారట! ఎన్టీఆర్ తరువాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తెరమీదికి వచ్చారు. అలాగే, కేసీఆర్ తరువాత తన మేనల్లుడు హరీష్ రావు సీఎం కుర్చీని హైజాక్ చేసేస్తారన్న భయంతోనే సెక్రటేరియట్ వాస్తు మార్చుతున్నారంటూ ఆరోపించారు. హరీష్ రావును చూసి కేసీఆర్ భయపడుతున్నారనీ, అందుకే వాస్తు మార్పులు పేరుతో సచివాలయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తన కుమారుడికి సీఎం సీటు దక్కుతుందో లేదో అనేది ఆయన భయం అని దుమ్మెత్తి పోస్తున్నారు. మొత్తానికి, కాంగ్రెస్ నేతలు చెబుతున్న కారణం కాస్త ఆసక్తికరంగా ఉంది కదా!