సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని పోలీసులు, అధికారులు పదే పదే ప్రజలకు చెబుతున్నా, వారిలో మాత్రం ఎలాంటి ఆవగాహన రాలేదు. తాజాగా ఈ వందతులకు మరో ఇద్దురు అమాయకులు బలి అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లో ని పాతబస్తీలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
ఇప్పటి వరకు గ్రామాలకే పరిమితమైన ఈ వదంతులు ప్రస్తుతం పట్టణాలు, నగరాలకు వ్యాపించాయి. మొన్న యాచకులు, నిన్న మానసిక స్థిమితం లేని వాళ్లు, నేడు హిజ్రాలు ఈ వదంతులకు బాధితులయ్యారు. బాబానగర్లో శనివారం రాత్రి 11.30 ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న హిజ్రాలపై స్థానికులు దాడి చేశారు. పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చిన ముఠాగా భావించి వారిపై దాడికి పాల్పడ్డారు.
విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని స్థానికులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై కూడా దాడులకు దిగారు. పెట్రోలింగ్ వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సివచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్ల సైతం గాయపడగా, రెండు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.
మహబూబ్నగర్కు చెందిన ఇద్దరు హిజ్రాలతో పాటు ఒక యువకుడు పాతబస్తీలోని చాంద్రాయణగుట్టకు వచ్చారు. రంజాన్ మాసం కావడంతో చాలా మంది రోడ్డుపై ఉన్నారు. హిజ్రాలు కనిపించగానే పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా వచ్చిందంటూ దాడికి పాల్పడ్డారు. బండరాళ్లతో వారిపై ఆ ముగ్గురిపై దాడిచేసి గాయపరిచారు. దీంతో అక్కడికక్కడే ఓ హిజ్రా చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అయిదే దాడిలో తీవ్రంగా గాయపడిన ఒకరు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే తీరులో మాదన్నపేటలో సైతం ముగ్గురు బిహార్ వాసులను స్థానికులు చితకబాదారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్సా అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికుల దాడిలో ఒకరు మృతి చెందినట్లు వెల్లడించారు. దాడిని అడ్డుకుని బాధితులను ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అనుమానితులకు పోలీసులు సహకరిస్తున్నారని చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్పై స్థానికులు దాడిచేశారని పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అనుమానితులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదుచేసి, కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు.