దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్ మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష ద్వారానే చేపట్టాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీనిపై గతంలో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఇంతకు ముందు జస్టీస్ కబీర్ తన పదవీ విరమణ రోజున నిట్ ను రద్దు చేస్తూ తీర్పు చెప్పారు.
అప్పట్లో ఇది సంచలనమయ్యింది. ఆ తీర్పు వల్ల ప్రైవేట్ మెడికల్ కళాశాలలు స్వంతంగా మెడికల్ పరీక్షలు నిర్వహించుకోవడానికి వీలు కలిగింది. అయితే ఈ తీర్పు సమీక్షించాలంటూ అఖిల భారత వైద్య మండలి సుప్రీంను ఆశ్రమించింది. దాదాపు రెండేళ్ల విచారణ తర్వాత సోమవారం నాడు సుప్రీంకోర్టు నిట్ను సమర్ధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో ఇక మీదట జరిగే మెడికల్ ఎంట్రస్ పరీక్షలన్నీ నిట్ ద్వారానే జరిగే అవకాశాలున్నాయి.
అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ తీర్పు అమలయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. దీనికి కారణం ఇక్కడ రాజ్యాంగంలోని 371 డి ఆర్టికల్ అమలులో ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు జమ్ము కశ్మీర్ లో కూడా ఇది అమలు కాదని నిపుణులు చెబుతున్నారు.