ఓటుకు నోటు కేసు మరో సారి తెరపైకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. కేసు పురోగతిపై సీఎం కేసీఆర్ ఆరీ తీస్తుండటంతో ఎప్పుడు ఏంజరుగుతుందోననే ఉత్కంఠ అన్ని వర్గాల్లో నెలకొంది. ఇన్నాల్లు స్తబ్ధతగా ఉన్న కేసు ఇప్పుడు స్పీడందుకుంది.
ఈ కేసులో చండీగఢ్ ఫోరెన్సిక్ నివేదిక రావడంతో సోమవారం అధికారులతో చర్చించారు. ఇప్పుడు మరోసారి కదిలిన కీలక కేసు విషయంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలు, ముందుకు సాగాల్సిన విధానంపై చర్చించేందుకు ఈ మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్, ఉన్నతాధికారులతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.కేసును విచారించిన ఏసీబీ, సీబీసీఐడీ అధికారులు ప్రగతి భవన్ కు రావాలని సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
దాదాపు మూడున్నరేళ్ల క్రితం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వద్దకు అప్పటి తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి వెళ్లి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేస్తే రూ. 50 లక్షలు ఇస్తామని చెబుతూ అడ్వాన్స్ చెల్లిస్తుండగా, ఏసీబీ అధికారులు రైడ్ చేసిన ఘటన తీవ్ర సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.
స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడుతూ, తాను అన్నీ చూసుకుంటానని, తమ వాళ్లు అన్నీ చెప్పారని చేసిన వ్యాఖ్యల ఆడియో మరింత కలకలం రేపింది. మూడు సంవత్సరాల తరువాత ఇప్పుడు మరోసారి కేసు తెరపైకి రావడం గమనార్హం.