డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్ వ్యవహారం కొత్త మలుపుతిరుగుతోంది.మాదాపూర్ లో ఉన్న ఈ కంపెనీపై మరో కేసు నమోదయింది.ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్థ చోరీ చేసిందని వైసీపీ యూత్ వింగ్ నేత రాంరెడ్డి ఈరోజు ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు వైసీపీ నేత రాంరెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అంతకు ముందు ఏపీ ప్రజల డేటాను ఐటీ గ్రిడ్ సంస్థ అక్రమంగా దొంగిలించి దుర్వినియోగం చేస్తోందంటూ లోకేశ్వర్రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ సంస్థపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు విచారణ ప్రారంభించారు.
ఇదలా ఉంటే ఈ ఘటనలో తమ ఉద్యోగులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఐటి గ్రిడ్ సీఈఓ అశోక్ హైకోర్టులోహెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను ఈరోజు ఇంటివద్దే విచారించిన జస్టిస్ చౌహాన్.. కేసు విచారణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. దీంతో ఆయనకు చుక్కెదురైంది. తమ అదుపులో ఉన్న ఐటీ గ్రిడ్ నలుగురు ఉద్యోగులను ఈరోజు హైకోర్టులో హాజరుపరిచారు. తమను పోలీసులు అరెస్ట్ చేయలేదని, విచారణ కోసమే పిలిపించారని వారు న్యాయస్థానంలో చెప్పారు. దీంతో అశోక్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది.
దీంతో అశోక్ అజ్ణాతంలోకి వెల్లినట్లు తెలుస్తోంది. ఆయన కోసం తెలంగాణా పోలీసులు వేట మొదలు పెట్టారు. సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కావలి, బెంగళూరులో గాలింపును ముమ్మరం చేశారు.