బద్ధ శత్రువులైన కాంగ్రెస్, టీడీపీ.. ఒకతాటికి రావడంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పార్టీ దీంతో ఇక ఆపార్టీ కనుమరుగే అని చెప్పవచ్చు. ఇరు పార్టీల అధ్యక్షులు రాహుల్, చంద్రబాబు ఢిల్లీలో భేటీ కావడం.. ఆ రెండు పార్టీల్లో ప్రకంపనలు రేపుతోంది. టీడీపీ- కాంగ్రెస్ అపవిత్ర పొత్తుపై ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇక మాజీ మంత్రి, ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు వట్టి వసంతకుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీతో కాంగ్రెస్ చేతులు కలపటానికి నిరసనగానే ఆయన పదవికి రాజీనామా చేశారు.1983 నుంచి టీడీపీతో పోరాడుతున్నామని..అలాంటి పార్టీతో కలవటం ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించటం ఖాయంగా కన్పిస్తోంది. టీడీపీకి చెందిన కొంత మంది సీనియర్ నేతలు సైతం టీడీపీ అధినేత చంద్రబాబు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శుక్రవారం తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి పంపనున్నట్టు ఆయన వెల్లడించారు.