పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని అంటారు! అలాగే, ఓడిపోయిన చోటే గెలవాలన్నది డీఎండీకే నేత విజయ్ కాంత్ పట్టుదల. తమిళనాడు ఎన్నికల్లో ఎన్నడూ చవిచూడదని ఘోర పరాభవాన్ని రుచిచూశారు కెప్టెన్. 104 స్థానాల్లో పోటీచేస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. దానికి తోడు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పుకుని బరిలోకి దిగిన కెప్టెన్ కూడా ఓడిపోవాల్సి వచ్చింది.
మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, పార్టీ పరాభవానికి కారణాలను వెతికే పనిలో పడ్డారు విజయ్ కాంత్. ఇంత ఘోర వైఫల్యానికి కారణాలు ఏంటా అనే విశ్లేషణలు మొదలుపెట్టేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో తొలి దఫా చర్యలు జరిపారు. 15 జిల్లాలకు చెందిన పార్టీ కార్యదర్శులతో కెప్టెన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వ్యక్తమైన కారణం ఏంటంటే.. పొత్తు విషయంలో కొన్ని తప్పులు జరిగాయనీ, స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే పరాయజయానికి కారణాలని చర్చించుకున్నారట.
కరుణానిధితో పొత్తు పెట్టుకుని ఉంటే ఫలితం వేరేలా ఉండేది. కానీ, కెప్టెన్ ఆ పని చేయలేదు. ప్రజల్లో ఏమాత్రం ఆదరణలేనివారి అంటకాగి కూటమిని ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పుడైనా ఆ కూటమిని వదులుకుంటున్నారా అంటే… అదీ లేదు! అవును, ఏ కూటమి అయితే ఎన్నికల్లో కలిసి పోటీ చేసి పరాజయాన్ని మూటగట్టుకుందో.. అదే కూటమి కొనసాగుతుందని కెప్టెన్ అంటున్నారు. త్వరలోనే తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఈ కూటమే మరోసారి పోటీకి దిగుతుందని విజయ్ కాంత్ అభిప్రాయపడుతున్నారు!! ఓడిపోయిన చోటే గెలవాలనీ… దెబ్బతిన్న కూటమి సత్తా ఏంటో చాటుకోవాలంటే కలిసే ఉండాలనీ… ఇలా కాస్త ఇన్స్పైరింగ్గా కెప్టెన్ మాట్లాడుతున్నారట. వినడానికీ విశ్లేషించుకోవడానికీ ఈ ప్రతిపాదనలు బాగానే ఉన్నాయి. కానీ, గెలవాలన్న కసి కూటమిలో ఉంటుంది. కానీ, ఓడిన కూటమిని గెలిపిద్దామన్న ఆలోచన ప్రజలకు ఉండాలన్న రూలేం లేదు కదా! మరి, కెప్టెన్ ధీమా ఏంటో చూడాలి..? ఓటమి కూటమి భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి..?