ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే హాట్హాట్గా నడిచింది. కరువు, నీటి ఎద్దడిపై సభలో జరిగిన చర్చ సమయంలో అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.ప్రధానంగా బాబు, జగన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రాష్ట్రంలో కరువు గురించి జరుగుతున్న చర్చలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. రైతుల కోసం సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించారు.
ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇలా సున్నా వడ్డీకే రుణం పథకం ఉందని…. దాన్ని కొనసాగించారని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ… 2014 – 19 వరకు చంద్రబాబునాయుడి హయాంలో సున్నా వడ్డీకి ఎన్ని నిధులు రుణం ఇచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు.
2014 నుంచి 19 వరకు ఎలాంటి సున్నా వడ్డీ రుణాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. రికార్డులు అసెంబ్లీకి తీసుకొస్తామన్నారు. ఎంత డబ్బు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలని సవాల్ విసిరారు. సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వని విషయాన్ని రుజువు చేస్తే చంద్రబాబు తన పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు.