ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 70వ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. సోమవారం మహానేత 70వ జయంతిని పురస్కరించుకుని నాయకులు, అభిమానులు పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. సోమవారం ఉదయం రాజన్న తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. రైతుల కష్టాన్ని దగ్గర నుంచి చూసి అర్థం చేసుకున్న మహానేత పుట్టిన రోజును రైతు దినోత్సవంగా జరిపించాలని తన పాదయాత్రలో చాలామంది కోరారని లేఖలో పేర్కొన్నారు. రైతు భరోసా పథకం’ కింద 54 లక్షల మంది రైతుల కుటుంబాలకు రూ.8750 కోట్లు పెట్టుబడి సాయం అందిస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రకటించారు.
ఇడుపుల పాయలో ప్రార్థనల అనంతరం జగన్ ఇడుపులపాయలో పర్యటించనున్నారు. గండి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గండిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం తిరిగి ఇడుపులపాయ చేరుకుని అక్కడి నుంచి జమ్మలమడుగుకు బయలుదేరి వెళ్లనున్నారు జగన్. 11.15 గంటలకు జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చెరుకుని రైతు దినోత్సవంలో పాల్గొంటారు.