మోకాలికీ బోడి గుండికీ ముడేయడం అని వెనకటికో సామెత ఉంది. అంటే, ఎలాంటి సంబంధం లేని రెండు విషయాల మధ్య ఏదో అవినాభావ సంబంధాన్ని ఆపాదించడం! దాదాపు అలాంటి పనే చేస్తున్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు. విశాఖపట్నంలో తూర్పు కాపుల సమావేశం జరుగుతోంది. ఇందులో భాగంగా ఆయన పాల్గొన్నారు.
కాపుల రిజ్వర్వేషన్ల విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. కాపులను బీసీల్లోకి చేర్చేందుకు కృషి చేస్తోందనీ దాన్లో భాగంగానే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారనీ తొమ్మిదినెలల గడువు కూడా కోరారని ఆయన చెప్పుకొచ్చారు. కాపుల సత్తా ఏంటో గడచిన ఎన్నికల్లో చూపించారని అన్నారు. పవన్ కల్యాణ్ పవర్ ఎంత అనేది గత ఎన్నికల్లో అందరికీ అర్థమైందని అంటున్నారు. ప్రభుత్వాల తలరాతను కాపులు రాస్తారని చెప్పుకొచ్చారు.
అంతవరకూ బాగానే ఉంది. కానీ, కాపుల అత్యుత్సాహం వల్లనే చిరంజీవి ముఖ్యమంత్రి కాకుండా పోయారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా సరిగా వినియోగించుకోలేకపోయారన్నారు. అక్కడితో ఆగకుండా… చిరంజీవి పోటీ చేయడం వల్లనే ఆ ఎన్నికల్లో వై.యస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారని అనడం విశేషం.
ఆ సందర్భంలో కొంతమంది ఫ్లెక్సీలు పెట్టి, రకరకాలుగా విషప్రచారం చేశారనీ లేదంటే అప్పుడు చిరంజీవి ముఖ్యమంత్రి పీఠం ఎక్కువారని అభిప్రాయపడ్డారు. అయితే, అప్పుడు వైయస్ ముఖ్యమంత్రి కావడానికి చిరంజీవి కారణమని చెప్పడమే విడ్డూరంగా ఉంది. ఎందుకంటే, అప్పటికే రైతు ముఖ్యమంత్రిగా పేదల నాయకుడిగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తిరుగులేని అభిమానాన్ని సంపాదించుకుని ఉన్నారు.
అంతేకాదు, ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువగా ఉన్నారు. కాబట్టి, వైయస్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అందరూ ఊహించారు. విచిత్రం ఏంటంటే… చిరంజీవి పార్టీ పెట్టిన తరువాత ఆయన సీఎం అయిపోతారని ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే, ప్రజారాజ్యం పార్టీకి నాటి ఎన్నికల సమయంలో ఒక నిర్మాణమే సరిగా లేదు.
కింది స్థాయిలో కేడర్ ఏర్పడలేదు. మెగాస్టార్గా చిరంజీవిని అభిమానించేవారందరూ నాయకుడిగా ఆయన్ని యాక్సెప్ట్ చేసి ఓట్లు వేస్తారా అనేది కూడా నాడు ప్రశ్నార్థకమే. అలాగని, కాపు సామాజిక వర్గంలో కూడా అత్యధికులు వైయస్సార్ను అభిమానించేవారు. మరి, మంత్రిగారు ఇవన్నీ మరచిపోయారో ఏమో మరి… ఆయన ఇలా మాట్లాడుకుంటూ వెళ్లిపోతున్నారు.