ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మొదటినుంచి పార్టీని నమ్మిన వాళ్లకు కీలకమైన పదవులు ఇస్తున్నారు. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. కృష్ణా జిల్లాకు చెందిన వాసిరెడ్డి పద్మ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు అందచేయడంతో.. ఆయన ఆమోదించారు.
వాసిరెడ్డి పద్మ గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. ఆతర్వాత 2011లో ఆమె తన భర్త కనికళ్ల వెస్లీతో కలిసి వైసీపీలో చేరారు. వైసీపీలో చురుగ్గా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ, ఇతర రాజకీయ పార్టీల విమర్శలను తిప్పికొట్టారు. వైసీపీ తరఫున పలు టీవీ, చర్చా కార్యక్రమాల్లో పాల్గొని తమ పార్టీ సిద్ధాంతాలు, విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు.
సార్వత్రిక వైసీపీ అధికారంలోకి రావడంతో.. ఆమె ఎమ్మెల్సీ కానీ నామినేటెడ్ పదవి కాని దక్కుతుందని భావించారు. వాసిరెడ్డి పద్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఎమ్మెల్సీగా జగన్ అవకాశం కల్పిస్తారని అంతా భావించారు. కానీ.. ఆమెను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్గా నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.