టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కొంగర కొలాన్లో జరిగింది ప్రగతి నివేదన సభ కాదని అది పుత్రుడి నివేదన సభని ఎద్దేవ చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వంద సీట్లు గెలిచే సత్తా టీఆర్ఎస్కు ఉంటే ఇతర పార్టీల నేతలను ఎందుకు చేర్చుకొంటున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాల కంటే ఇతర అంశాలను కూడ తమ ప్రభుత్వం అమలు చేసినట్టుగా ప్రగతి నివేదన సభలో కేసీఆర్ చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావిస్తాంచారు.
చుక్కరక్తం చిందించకుండా తెలంగాణ తెచ్చినట్లు కేసీఆర్ చెబుతున్నారనీ, మరి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది సంగతేంటని రేవంత్ ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ కోసం 1200 మంది ప్రాణాలు విడిచారు. మరి మీ ఇంట్లో నుంచి ఉద్యమం కోసం ఒక్కరైనా శ్మశానానికి పోయారా?’ అని ఆగ్రహంగా ప్రశ్నించారు.
51 మాసాలైనా తెలంగాణ అమర వీరుల స్థూపం ఎందుకు నిర్మించలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులకు ఆరోగ్యభీమా విషయంలో కూడ కేసీఆర్ సర్కార్ హమీలు అమలు కావడం లేదన్నారు.
ప్రగతి నివేదన సభకు కనీసం మూడున్నర లక్షల మంది కంటే ఎక్కు మంది కూడ రాలేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆత్మరక్షణలో పడినట్టుగా ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం చూస్తే అర్థమౌతోందన్నారు. చివరకు ఐఏఎస్ అధికారులను కూడా తెలంగాణ ప్రభుత్వం చులకనగా చూస్తోందనీ, దీంతో అధికారులు తిరుగుబావుటా ఎగరవేశారని రేవంత్ అన్నారు.