సెప్టెంబర్ 17న హైదరాబాద్ తుక్కుగూడలో భారీ బహిరంగసభను నిర్వహించనుంది తెలంగాణ కాంగ్రెస్. ఈ బహిరంగసభకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ,మల్లికార్జున ఖర్గేతో పాటు ముఖ్యనేతలు హాజరుకానున్నారు. ఇక ఇదే వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనుండగా దాదాపు 10 లక్షల మంది జనసమీకరణ చేసే దిశగా వ్యూహరచన సిద్ధం చేశారు.
ఈ బహిరంగసభ ద్వారా కాంగ్రెస్ శ్రేణులను ఎన్నికలకు సమాయాత్తం చేయడమే కాదు వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనన్న వాదాన్ని ప్రజల్లో గట్టిగా తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. ఇక ఇదే వేదికగా బీఆర్ఎస్, బీజేపీల నుండి భారీగా చేరికలు జరగనున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు రోహిత్ ఈ సభ ద్వారా కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయం కాగా ఊహించని చేరికలు కూడా ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
బీఆర్ఎస్ టికెట్లు దక్కించుకున్న ఇద్దరు ముగ్గురు నాయకులు హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరే ఆ నేతలెవరా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీజేపీ నుండి కూడా పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ పూర్తవగా అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ పలుమార్లు భేటీ కూడా అయింది. అయితే సెప్టెంబర్ 17 బహిరంగసభ, పార్టీలో చేరికల తర్వాత తొలి లీస్ట్ని ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా సెప్టెంబర్ 17 సభను విజయవంతం చేసి ఎన్నికల రణరంగంలో దిగాలని భావిస్తున్న కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి..