టీడీపీ లో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. పలువురు సిట్టింగ్ నేతలకు టికెట్ల కేటాయింపు కత్తిమీద సాములా మారింది. రాష్ట్రరాజకీయాలతోపాటు…జాతీయ రాజకీయాల్లో తన సత్తా చాటాలని చూస్తున్న బాబుకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటంలేదు. సిట్టింగ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడటం బాబుకు మింగుడు పడటంలేదు. అనకాపల్లి ఎంపీ అవంతిశ్రీనివాస్ వీడిన కొద్దిగంటల్లోనే మరో ఎంపీ పార్టీకి గుడ్బాయ్ చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆయన పార్టీమారేందుకు నిర్ణయం తీసుకున్నారు. తన పార్లమెంట్ పరిధిలో కొందరు టీడీపీ నాయకులు తనను ఎదగనీయకుండా చేస్తున్నారని బాబుకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితంలేకపోవడంతో అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. మరో వైపు కోనసీమ రైతులను ఆదుకొనేందుకు ప్రయత్నం చేస్తుంటే ఆప్రయత్నానికి పార్టీ అధినాయకత్వం సహకరించడం లేదని తన అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం.
పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన పార్టీ నేతలకు అందుబాటులో లేనట్లు సమాచారం. మరో వైపు వలసపై ఉదయం పార్టీనేతలతో బాబు టెలీ
కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో రవీంద్రబాబు గైర్హాజరయినట్లు తెలుస్తోంది. తాజాగా వైసీపీ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఇద్దరు ఎంపీలు వైసీపీ కండువా కప్పుకోనున్నారని ప్రకటించారు. దీంతో పండుల
రవీంద్రబాబు కూడా వైసీపీలో చేరుతున్నారనేదానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.