కోనసీమ అలర్ల ఘటన అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం పెంచింది. కోనసీమ అల్లర్ల వెనుకున్న కుట్రకోణం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమలాపురం దాడులపై ప్రతిపక్షాల స్పందన చూస్తుంటే.. వాళ్లే కథంతా నడిపించారనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు. కోనసీమ అల్లర్లు ప్రభుత్వం స్పాన్సర్ చేసినవేనని ఏపీ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు నుంచి ప్రజల్ని దారిమళ్లించేందుకే కోనసీమ అల్లర్లు సృష్టించారని ఆరోపించారు.
వైసీపీకి ప్రేమ ఉంటే నవరత్నాలకు అంబేడ్కర్ పేరు పెట్టొచ్చుగా అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. జిల్లాలకు కొత్త పేర్లు పెట్టేటప్పుడే కోనసీమకు అంబేడ్కర్ పేరు కూడా పెడితే బాగుండేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆనాడే అంబేడ్కర్ పేరు పెట్టి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టే విషయంలో రెఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఆందోళనకారులు తగులబెట్టిన తన ఇంటిని మంత్రి పినిపే విశ్వరూప్ పరిశీలించారు. కోనసీమ ప్రాంతంలో గత 50 ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదని అన్నారు. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనలో కొన్ని సంఘ విద్రోహశక్తులు, కొంతమంది రౌడీషీటర్లు చేరి దశ, దిశ లేని ఉద్యమాన్ని పక్కదోవ పట్టించారని ఆరోపించారు.