ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు భాజాపా ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిసరతెలిపారు. సచివాలయానికి బీజేపీ ప్రజా ప్రతినిధులు గొడుగులు పట్టుకొని, రెయిన్ కోట్లు ధరించి వచ్చారు. వర్షాలకు సచివాలయంలో నీరు లీకవుతుండటం పట్ల వారు ఈవిధంగా నిరసన తెలిపారు. వేయి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమయిందని వారు ఆరోపించారు. వర్షాకాల సమావేశాలు కాబట్టి, ముందు జాగ్రత్త చర్యగా గొడుగులు, రెయిన్ కోట్లతో అసెంబ్లీకి వచ్చామని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగు కు 10 వేలు ఇచ్చి తాత్కాలిక అసెంబ్లి నిర్మాణం ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారని మండిపడ్డారు. హడావుడిగా నిర్మాణం చేపట్టడంతోనే ఈ దుస్థితి వచ్చిందన్నారు భాజాపా ఎమ్మెల్సీ.
ఈ నెల 19 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఏడు పని దినాల పాటు సభను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈ నెల 6, 7, 10, 11, 17, 18, 19 తేదీల్లో సభ జరగనుంది.అంతకు ముందు స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగగా… సమావేశానికి మంత్రులు యనమల, కాల్వ శ్రీనివాసులు, విప్ కూన రవికుమార్, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజులు హాజరయ్యారు.