ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఐటీ దాడులు, జగన్పై హత్యయత్నం సంఘటన నేపథ్యలో బాబు ఢిల్లీకి వెల్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఢిల్లీ ప్రధాని కేజ్రీవాల్, శరద్ యాదవ్ వంటి నేతలను కలిశారు. అనంతరం కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రెస్మీట్ నిర్వహించారు.
రాష్ట్రంపై కేంద్రం కక్ష గట్టిందని అందుకే ఐటీ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు.ఢిల్లీలో యోగేంద్ర యాదవ్, కర్ణాటకలో మంత్రి శివకుమార్ నివాసాలతో పాటు తమిళనాడు సీఎం దివంగత జయలలితకు సంబంధించి 19 చోట్ల దాడులు చేశారని చెప్పారు. ఇవన్నీ రాజకీయ దురుద్దేశాలతోనే జరిగాయని ఆరోపించారు.
టీడీపీని లక్ష్యంగా చేసుకుని ఏపీలో ఒక్కసారిగా 19 ఐటీ బృందాలను దాడులకు పురిగొల్పారని తెలిపారు. ఏదో ఒక రోజు తనపై కూడా దాడి చేస్తారని, వాటని ఎదుర్కొని నిలబడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన రూ.350 కోట్లను చెప్పాపెట్టకుండా కేంద్రం వెనక్కు తీసుకుందని చంద్రబాబు అన్నారు.
తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి తొమ్మిది జిల్లాలకు మాత్రం రూ.450 కోట్లు ఇచ్చారని తెలిపారు. వారికి సాయం అందించడాన్ని తాము తప్పుపట్టడం లేదని, ఏపీపై వివక్ష చూపడం తగునా అని మాత్రమే ప్రశ్నిస్తున్నానని అన్నారు.
తాము అధికారంలోకి వస్తే నల్లధనం వెనక్కి తెస్తామంటూ బీజేపీ ప్రగల్బాలు పలికిందని, కానీ, అలాంటిదేమీ చేయలేదని చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్లో నగదు జమా చేస్తామన్న హామీ ఏమైందన్నారు. నోట్ల రద్దు నిర్ణయం సరైనదని కాదని, దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చంద్రబాబు తెలిపారు. పెద్ద నోట్లు రద్దు చేస్తామని చెప్పిన కేంద్రం.. రూ.2వేల నోట్లు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు.