కర్నూలు జిల్లా టీడీపీలో వేడి రాచుకుంది. పార్టీలో కుమ్ములాటలు మరోసారి బయట పడ్డాయి. మంత్రి భూమా అఖిలప్రియ, పార్టీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి ఘర్షణ చేరింది. వీరిద్దరి మధ్య విబేధాలు క్లైమాక్స్కు చేరాయి.
తాజాగా వీరిద్దరి మధ్య కొత్త సంవత్సరం చిచ్చురేపింది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. నూతన ఏడాదిని స్వాగతిస్తూ డిస్సెంబర్ 31వ తేదీన ఏవీ సుబ్బారెడ్డి ఏర్పాటు చేసిన డిన్నర్కు రావాలంటూ నంద్యాల, ఆళ్లగడ్డ నేతలకు స్వయంగా ఆహ్వానం పలికారు. నాకు తెలియకుండా డిన్నర్ ఎలా ఏర్పాటు చేస్తారంటూ డిన్నర్కు ఎవరూ వెల్లొద్దంటూ నేతలకు హుకుం జారీ చేసింది మంత్రి అఖిలప్రియ.
అయితే అఖిలతో తాడో పేడో తేల్చుకొనేందుకు ఏవీ సుబ్బారెడ్డి సిద్దమవుతున్నారు. భూమా అఖిలప్రియకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగింది. ఏకంగా ఒక ఫంక్షన్ హాల్ను తీసుకుని భారీగా డిన్నర్ ఇస్తున్నారు. దీనికి రెండు నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యేలా చూసుకుంటున్నారు. తద్వారా తన బలమేమిటో చూపించాలని దృఢనిశ్చయంతో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇద్దరిమధ్య ఏంజరగుతుందోనని పార్టీలో చర్చజరుగుతోంది.
నంద్యాల ఉప ఎన్నిక అనంతరం ఆళ్లగడ్డలో తన పుట్టినరోజు సందర్భంగా ర్యాలీ నిర్వహించాలని ఏవీ పోలీసుల అనుమతి తీసుకున్నారు. అయితే, ర్యాలీ జరపకుండా మంత్రి నేరుగా రంగంలోకి దిగి అడ్డుకున్నారనే ప్రచారముంది. ఆళ్లగడ్డలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఏవీ బిల్డింగ్కు కూడా మంత్రి నోటీసులు ఇప్పించారు. నిర్మాణం ముందుకు సాగకుండా మంత్రి అడ్డుకున్నారనేది ఏవీ ఆరోపణ. ఈ క్రమంలోనే ‘న్యూఇయర్ డిన్నర్’తో ఇద్దరి మధ్య విభేదాలు మరింతగా ముదురుతున్నాయి.
కేవలం నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఆర్టీసీ ఛైర్మెన్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. ఎన్నక తర్వాత ఏవీసుబ్బారెడ్డిన పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 31న డిన్నర్ వేదికగా ఏవీ సుబ్బారెడ్డి టీడీపీ నాయకత్వం ముందు బల నిరూపణకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. పార్టీమారుతారనే ప్రచారం జరుగుతోంది.